టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్గా పంత్ ఎదుగుతాడని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్తో పంత్ సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి రీఎంట్రీ ఇస్తున్నాడు.
2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత పంత్ టెస్టు ఫార్మాట్కు ఎంపికవ్వడం ఇదే తొలిసారి. 15 నెలల తర్వాత పోటీ క్రికెట్కు తిరిగొచ్చిన పంత్ ఐపీఎల్లో నిలకైడన ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు. అనంతరం శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా సెలక్ట్ అయ్యాడు. తాజాగా బంగ్లాదేశ్ సిరీస్తో అన్ని ఫార్మాట్లలో పునరాగమనం చేయనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ ధనాధన్ ఇన్నింగ్స్తో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.

''భారత టెస్టు అత్యుత్తమ బ్యాటర్లలో పంత్ ఒక్కడిగా భావిస్తున్నా. అతను భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చినందుకు నాకేమి ఆశ్చర్యం లేదు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడుతూనే ఉంటాడు. అతను టెస్టుల్లో గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) క్రికెటర్గా ఎదుగుతాడు. అయితే అలా జరగాలంటే అతను ఇలానే ప్రదర్శన కొనసాగించాలి. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను ఆటను మెరుగుపర్చుకోవాలి. కాలక్రమేణా తనకి ఉన్న ప్రతిభతో పంత్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒక్కరిగా నిలుస్తాడు'' అని గంగూలీ పేర్కొన్నాడు.
గాయం కారణంగా మహ్మద్ షమి బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు ఎంపిక కాలేదని భావిస్తున్నట్లు గంగూలీ తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనకు షమి అందుబాటులో వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. భారత జట్టుకు ఇది అసలైన పరీక్ష అని అన్నాడు.
అలాగే వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కూడా ఆసక్తికరంగా సాగుతుందని పేర్కొన్నాడు. బుమ్రా, సిరాజ్తో షమి చేరితే భారత బౌలింగ్ దళం బలోపేతంగా ఉంటుందని దాదా అన్నాడు. నవంబర్ ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17 నుంచి బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.