పాండ్యా, రాహుల్ మాటలు అభ్యతంరకరమైనవే
ముంబైలో ఓ కార్యక్రమానికి హజరైన గంగూలీ మాట్లాడుతూ "నిజమే! పాండ్యా, రాహుల్ మాటలు అభ్యతంరకరమైనవే. వారు మాట్లాడింది తప్పే. కానీ, మనమంతా మనుషులం. మెషీన్లం కాదు. మెషీన్ మాదిరిగా మనం ముందుగానే ఫిక్స్ చేసినట్టుగా అన్నీ పర్ఫెక్ట్గా జరగాలని లేదు. తీవ్ర విమర్శలతో వారిని మరింత బాధించొద్దు" అని అన్నాడు.
తప్పును తెలుసుకుని కుమిలిపోతున్నారు
"మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధాన్ని ఎదుర్కొంటున్న వీరిద్దరూ తాము చేసిన తప్పును తెలుసుకుని కుమిలిపోతున్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయరు. వారికొక అవకాశమిద్దాం. వారిపై విమర్శలతో ఇంకా రాద్ధాంతం చేయొద్దు. మనం బతుకుదాం. ఇతరులను బతకనిద్దాం" అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.
మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు
‘కాఫీ విత్ కరణ్' టీవీ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను హార్దిక్, రాహుల్లపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు బీసీసీఐ వారిని జట్టు నుంచి తప్పించింది. వీరిద్దరిపై బోర్డు విచారణకు ఆదేశించడంతో ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా బీసీసీఐ సీఈఓ జోహ్రి నుంచి ఫోన్
ఇప్పటికే, వారిద్దరిపై విచారణ మొదలైంది. విచారణలో భాగంగా బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి మంగళవారం వారితో ఫోన్లో మాట్లాడారు. అయితే కేవలం క్రికెటర్లు చెప్పింది మాత్రమే ఆయన విన్నారని... టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యం, ఆ వ్యాఖ్యల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదని తెలిసింది.