Sourav Ganguly: ప్రపంచ క్రికెట్లో దాదా కేవలం పేరు మాత్రమే కాదు. ఏ ఆటగాడు మ్యాచ్ లేని ఫియర్లెస్ లీడర్షిప్కు నిదర్శనం. తన దూకుడుతనంతో ఒకప్పుడు ఆటగాడిగా దుమ్మురేపాడు. ఆ తర్వాత జట్టు సారథిగా అదరగొట్టాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించాడు. అయితే ప్రస్తుతం క్రికెట్ కు కాస్త దూరంగా ఉంటోన్న గంగూలీ.. ప్రస్తుతం కెమెరా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
రెండు కొత్త షోలతో..
గంగూలీ ఓ టెలివిజన్ షోతో బుల్లితెరపై గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. హోస్ట్ గా మళ్లీ టీవీ కెరీర్ ప్రారంభించనున్నాడు. స్టార్ జల్సా అనే టీవీ ఛానల్ తో 4 సంవత్సరాలకు గానూ భారీ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.125 కోట్లు అని అంచనా. ఈ ఒప్పందంలో రెండు షోలకు గంగూలీ వర్క్ చేయనున్నాడు. అందులో ఒకటి బిగ్ బాస్ బంగ్లా కాగా, మరొకటి క్విజ్ షో. ఈ రెండు 2026 జులై నుంచి ప్రసారం కానున్నాయి. హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో వీటిని చిత్రీకరిస్తున్నారు. ఈ షోలకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ 2025 జులై నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా, ఇప్పటికే గంగూలీ జీ బంగ్లాలో దాదాగిరి అనే షోకు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షోకు వీడ్కోలు పలికి ఇప్పుడు కొత్త ఛానల్ టీవీతో డీల్ కుదుర్చుకన్నాడు గంగూలీ.

కొత్త ఇన్నింగ్స్ ఆడేందుకు రెడీ..
ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. "ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి టెలివిజన్ ఎప్పుడూ నాకు ఓ ప్రత్యేకమైన, అద్భుతమైన వేదికగా నిలిచింది. ఇప్పుడు స్టార్ జల్సాతో కలిసి నాన్-ఫిక్షన్ కార్యక్రమాల ద్వారా కథల్ని చెప్పడానికి, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. వినోదం, మెధాసంపత్తికి ప్రాధాన్యమిచ్చేలా రెండు ప్రత్యేకమైన షోలకు హోస్ట్ చేయడానికి సిద్ధమవ్వడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. మైదానానికి బయట ప్రేక్షకులతో బంధాన్ని ఏర్పరచుకోవడంలో ఓ బలమైన విశ్వాసం ఉంటుంది. ఈ టెలివిజన్ ద్వారా నేను నిజమైన కథలు, ప్రజల్ని స్పూర్తి కలిగించే అనుభవాలు అందించగలనన్న నమ్మకం ఉంది. ఇది నా కొత్త ఇన్నింగ్స్. దీన్ని ప్యాషన్ తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా." అని పేర్కొన్నాడు.