
కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజా భేటీపై రాజకీయ దుమారం మరోసారి చెలరేగింది. గంగూలీ బీజేపీ పార్టీలో చేరుతున్నారా?.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దాదాను బీజేపీ తురుపుముక్కగా వాడుకోవాలని చూస్తున్నదా? అనే ప్రశ్నలు సాధారణ ప్రజల మనసులలో మెదులుతున్నాయి. ఎలాంటి అవసరం లేకుండానే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ను దాదా ఎందుకు కలిశారంటారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక గంగూలీ రాకతో బీజేపీలో హీట్ పెరుగుతుందని సగటు బీజేపీ కార్యకర్త భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తున్నది.
ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ గవర్నర్ ధన్ఖర్తో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సమావేశం దాదాపు గంటసేపు కొనసాగింది. ఈ సమావేశం తరువాత దాదా బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఇది ఒక సాధారణ భేటీ అని, రాజకీయంకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ భవన్తో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పలు సమస్యలపై చర్చించినట్లు సమావేశం అనంతరం గవర్నర్ ధన్ఖర్ ఓ మీడియాతో చెప్పారు. ఈడెన్ గార్డెన్స్ సందర్శించాలి కోరిన గంగూలీ ఆహ్వానానికి అంగీకరిస్తున్నానని తెలిపారు.
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ గవర్నర్తో సౌరవ్ గంగూలీ భేటీ కావడంపై దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చసాగుతోంది. బీజేపీలో దాదా చేరితే కొత్త ఊపు వస్తుందని ఆయన అభిమానులు, వర్గీయులు బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుకు వస్తారని కమలం కార్యకర్తలు భావిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అంతకు కొన్ని రోజుల ముందే రాజకీయ గందరగోళం తీవ్రమైంది.
సౌరవ్ గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై ఇది వరకే పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున బెంగాల్ అసెంబ్లీకి దాదా పోటీ చేస్తారని, అతన్ని సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సైతం సాగింది. ఒకవేళ గంగూలీ బరిలో నిలవకపోతే అతని భార్యను పోటీలో నిలపుతారని కూడా వార్తలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీని ఎంపిక చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పడు గవర్నర్తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎలాంటిది ఏమీలేదని గవర్నర్ స్పష్టం చేసినా.. దాదా పొలిటికల్ ఎంట్రీపై మాత్రం చర్చలు ఇప్పట్లో ఆగేలా లేవు.