ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్ధాన్ రాయల్స్ జట్లను నిషేధించాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసేందుకు గాను బీసీసీఐ ఒక వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఐదుగురు సభ్యులుగా గల ఈ కమిటీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి స్ధానం కల్పించారు. ఇందులో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ లీగల్ హెడ్ ఉషాంత్ బెనర్జీ, ట్రెజరర్ అనిరుథ్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ ఆరు వారాల్లోగా మాజీ చీఫ్ జస్టిస్ లోధా ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి, బీసీసీఐకి తగిన ప్రతిపాదనలతో నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత బీసీసీఐ వర్కింగ్ కమిటీతో వీరు చర్చలు జరుపుతారు. అనంతరం రెండు జట్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

బీసీసీఐ లీగల్ అడ్వైజర్ యుఎన్ బెనర్జీ ఈ ఐదుగురు సభ్యుల వర్కింగ్ కమిటీకి సహకరించనున్నారు. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సారథ్యంలో ఈ వర్కింగ్ కమిటీ పనిచేస్తుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథన్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్ కుంద్రాలను లోధా కమిటీ దోషులుగా ప్రకటిస్తూ జీవితకాల నిషేధం విధించింది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల కాలం పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో ఈ రెండు జట్లను నిషేధించాలా లేదా వీట స్ధానంలో కొత్త జట్లను తీసుకోవాలా? అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ ఈ వర్కింగ్ కమిటీని వేసింది.
ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదికను బట్టి బీసీసీఐ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందేమో చూడాలి మరి.