హైదరాబాద్: 16 ఏళ్ల తరువాత తొలిసారి రైళ్లో ప్రయాణం చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్లోని బలూర్ ఘాట్లో గంగూలీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను శనివారం రైల్లో బయల్దేరిన గంగూలీతో ఓ ప్రయాణికుడు గొడవపడ్డాడు.
శనివారం క్యాబ్ జాయింట్ సెక్రటరీ అభిషేక్ దాల్మియాతో కలిసి పడాటిక్ ఎక్స్ప్రెస్లో అక్కడికి బయల్దేరాడు. రైల్లో దాదాకు కేటాయించిన ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ లో ముందుగానే ఒక ప్రయాణికుడు కూర్చొని ఉన్నాడు. దాంతో గంగూలీ అది తన సీట్ అని చెప్పాడు. కానీ ఆ ప్రయాణికుడు ఒప్పుకోలేదు సరికదా ఏకంగా దాదాతో గొడవపడ్డాడట.
దాంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది గంగూలీ బెర్తును మరొకచోటకి మార్చారు. ఏసీ టూ టైర్లో గంగూలీకి బెర్తును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బలూర్ ఘాట్లో ఏర్పాటు చేసిన తన ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని గంగూలీ ఆవిష్కరించాడు.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ 2001లో రైల్లో ప్రయాణించిన తర్వాత మళ్లీ ఇంతకాలానికి రైల్లో ప్రయాణం చేసినట్లు తెలిపాడు. అయితే అతనికి ఎదురైన చేదు అనుభవం గురించి దాదా ప్రత్యేకించి ఏమీ మాట్లాడక పోవడం విశేషం.