ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూసిన వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 5న చివరి వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ పోరుతో ఈ టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో లీగ్లో తమ జర్నీ ప్రారంభిస్తుంది. అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.
ఈ షెడ్యూల్ విడుదలవగానే క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. తమ ఫేవరెట్ జట్ల మ్యాచులు ఎప్పుడని క్యాలెండర్లలో మార్క్ చేసుకోవడం మొదలు పెట్టేశారు కూడా. ఈ క్రమంలోనే భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజున అహ్మదాబాద్లో ఉండేందుకు హోటల్స్ కూడా ఇప్పటి నుంచే బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఈ సిటీలో హోటల్ గదుల ధరలు కూడా పెరిగిపోయాయట.

ఇలాంటి క్రమంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. 'భారత్లో వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నా. కరోనా కారణంగా నేను ప్రెసిడెంట్గా ఉండగా వరల్డ్ కప్ నిర్వహించలేకపోయా. ఈ వరల్డ్ కప్ ఎంత గొప్పగా ఉంటుందని ఆసక్తిగా ఉన్నా. అద్భుతమైన వేదికలు, చక్కగా అలాట్ చేశారు. ఇన్ని వేదికలు ఉన్నాయని మరే దేశమూ గర్వంగా చెప్పుకోలేదు' అని గంగూలీ అన్నాడు.
అలాగే ప్రపంచం అంతా గుర్తుంచుకునే రేంజ్లో ఈ టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ప్రపంచం మర్చిపోలేనంత గొప్పగా బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహిస్తుంది. బీసీసీఐ, జై షా, రోజర్ బిన్నీ.. అందరికీ కంగ్రాట్స్' అని గంగూలీ ట్వీట్ చేశాడు. గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021 టీ20 క్రికెట్ వరల్డ్ కప్ను భారత్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ టోర్నీని యూఏఈకి తరలించాల్సి వచ్చింది.