
సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, జట్టుకు ఇదొక మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోతుందన్నారు. అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్లోని సౌథాంప్టన్లో భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
'టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడటం ఇదే తొలిసారి. ఏ క్రికెటర్కైనా ఇదొక గొప్ప క్షణం. నిజానికి టెస్టు క్రికెట్ ప్రతీ ఆటగాడి కెరీర్లో ఒక అత్యుత్తమ అంకం. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నందుకు విరాట్ కోహ్లీ ఎంతో సంతోషంగా ఉంటాడు. అంతేకాదు గర్వపడతాడు కూడా. గత రెండేళ్లుగా ఎంతో మెరుగ్గా ఆడుతున్న కారణంగానే భారత్ ఫైనల్కు చేరింది. ఆస్ట్రేలియాతో సిరీస్ నెగ్గడం ఎంతో ప్రత్యేకం. రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో మన ఆటగాళ్లు మైదానంలో అడుగుపెడతారని నేను విశ్వసిస్తున్నా' అని సౌరవ్ గంగూలీ తెలిపారు.
బీసీసీఐ బాస్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్ జట్టుపై కూడా ప్రశంసలు కురిపించారు. గత కొన్నాళ్లుగా కివీస్ నిలకడగా ఆడుతోందని, ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో అని పేర్కొన్నారు. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్ నెగ్గడంతో వారిలో మరింత ఉత్సాహం నింపి ఉంటుందన్నారు. టెస్ట్ మ్యాచ్ల ద్వారా కివీస్పూజట్టుకు పూర్తి ప్రాక్టీసు లభించిందని చెప్పుకొచ్చారు. కేన్ సేన కూడా బలమైన జట్టేనని, భారత్ టైటిల్ గెలవాలంటే కష్టపడాల్సిందే అని దాదా అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ఇంగ్లండ్ వెళ్లారు. అంతకుముందు మీడియా సమయంలో పాల్గొన్న దాదా మ్యాచ్ గురించి స్పందించారు.
ఈ నెల 3న సౌథాంప్టన్కి చేరుకున్న భారత క్రికెటర్లు.. రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ సెంచరీ చేయగా.. శుభమన్ గిల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు బాదారు. బౌలింగ్లో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. మొహ్మద్ సిరాజ్ రాణించాడు. మరోవైపు ఇంగ్లండ్తో ఇటీవల రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్.. ఒక మ్యాచ్ని డ్రాగా ముగించుకుని మరో మ్యాచ్లో విజయాన్ని అందుకుంది.