కెప్టెన్గా ధోనీ ఏం చేశాడు
తాజాగా యువరాజ్ తండ్రి యోగిరాజ్ సింగ్ న్యూస్ 24తో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ భారతదేశం తరఫున చాలా సంవత్సరాలు ఆడాడు. నేను అతనిని సూటిగా ఓ విషయం అడగాలనుకుంటున్నా.. ఇన్ని సంవత్సరాలలో ఏ క్రికెటర్ కోసమైనా ఏదైనా చేశాడా?. ధోనీ ఇతర క్రికెటర్ల కోసం ఏదైనా చేసి ఉంటే.. వారు అతనిని ప్రశంసించేవారు. సౌరవ్ గంగూలీ కేవలం తన గురించే ఆలోచించుకుని ఉండింటే.. అతడు మరింత ఉన్నత స్థాయికి చేరుకునేవాడు. దాదా తన కోసం కాకుండా.. దేశం, జట్టు కోసం ఆడాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించాడు' అని తెలిపాడు.
కెప్టెన్ కావడానికి యువరాజ్ అర్హుడు
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకి కెప్టెన్ కావడానికి యువరాజ్ సింగ్ అర్హుడు కానీ.. ఎంఎస్ ధోనీ కాదు అని రెండు రోజుల క్రితమే యోగిరాజ్ అన్నాడు. 'వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ మాట్లాడిన వీడియోలను చూశాను. వీడియోలో వారు మాట్లాడిన ప్రతి అంశాన్ని విన్నాను. ప్రతి ఒక్కరూ ధోనీ గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒకటి నెగటివ్గా మాట్లాడారు. అయితే సౌరవ్ గంగూలీ గురించి ఎవరూ చెడుగా మాట్లాడలేదు. గంగూలీ సారథ్య బాధ్యతలు అందుకునే సమయానికి భారత జట్టు నంబర్ ఏడులో ఉండేది. యువరాజ్, కైఫ్, ఖాన్, హర్భజన్, సెహ్వాగ్, గంభీర్ తదితర యువ క్రికెటర్లతో అప్పట్లో జట్టుని దాదా సిద్ధం చేసుకున్నాడు. గంగూలీ తర్వాత యువీ కెప్టెన్ కావాల్సింది. కానీ.. విధి ధోనీని కెప్టెన్ని చేసింది' అని యోగరాజ్ సింగ్ చెప్పారు.
అనూహ్యంగా ధోనీకి అవకాశం
ఎంఎస్ ధోనీ కంటే ముందే భారత్ జట్టులోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ జట్టులోకి వచ్చే సమయానికి యువీ కీలక ప్లేయర్. ఇక రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ఇద్దరు మంచి స్థానానికి చేరుకున్నారు. సీనియర్లు ఆడకపోవడంతో.. 2007లో టీ20 ప్రపంచకప్ కోసం ధోనీ తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. యువీ కూడా కెప్టెన్సీ రేసులో నిలిచాడు కానీ.. అనూహ్యంగా ధోనీకి ఆ అవకాశం దక్కింది. మహీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు టోర్నీలలో యువీ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు.
304 వన్డేలు.. 8701 పరుగులు
2019 వన్డే ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంతో.. గత ఏడాది టోర్నీ జరుగుతున్న సమయంలోనే యువీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1,900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8,701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1,177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
డైలమాలో ధోనీ భవిష్యత్తు:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.