హైదరాబాద్: క్రికెట్లోకి ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా క్రికెట్ మైదానంలో అనుచితంగా ప్రవర్తించే వారికి రెడ్ కార్డ్ చూపించి, స్టేడియం నుంచి బయటకు పంపే నిబంధనను స్వాగతించాడు.
మైదానంలో హద్దులు దాటడంతో పాటు, ఇతర క్రీడాకారులపై అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఆటగాళ్లను బయటికి పంపే అధికారాన్ని అంపైర్లకు కల్పిస్తూ, ఐసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధన ముఖ్యంగా కింది స్థాయి క్రికెట్ మ్యాచ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని గంగూలీ చెప్పాడు.
అంపైర్ను దూషించినా, ఉద్దేశ పూర్వకంగా ఎదుటి జట్టు ఆటగాడిని అడ్డుకున్నా లేదా చెయ్యి చేసుకున్నా, ఇతర ఆటగాడిపై హింసాత్మకంగా ప్రవర్తించినా అంపైర్ తన విశేషాధికారాలను వినియోగించే వీలును ఐసీసీ కొత్త నిబంధన కల్పిస్తుంది. సాధారణంగా లెవల్ 4 తప్పులకే రెడ్ కార్డును చూపించాల్సి ఉంటుంది.

లెవల్ 1 నుంచి లెవల్ 3 తీవ్రతతో ఉండే తప్పులను చేసే ఆటగాళ్లకు ప్రస్తుతం అమలులో ఉన్న ఐసీసీ ప్రవర్తనా నియమావళే వర్తిస్తుంది. ఐసీసీ కొత్త రూల్స్ సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలపై గంగూలీ బుధవారం కోల్ కతాలో మీడియాతో మాట్లాడాడు.
'ఆట నిబంధనల్లో మార్పులు అవసరం. దాని వల్ల మంచి జరుగుతుంది. ఇండియాలో కింది స్థాయి క్రికెట్లో పెద్దగా సమస్యలు కనిపించవు కానీ.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఇబ్బందికర ఘటనలు జరుగుతున్నాయి. వీడియో సాక్ష్యాలు చూస్తే తప్ప తీవ్రత తెలియదు. కాబట్టి రెడ్ కార్డుతో ఆటగాళ్లను మైదానం నుంచి బయటికి పంపే నిబంధన మంచిదే' అని గంగూలీ అన్నాడు.
ఈ కొత్త నిబంధన వల్ల క్రికెట్లో సాధారణంగా చేసే తప్పుల తీవ్రత కూడా తగ్గుతుందని కూడా గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఫుట్ బాల్, హాకీ తదితర క్రీడల్లో రెడ్ కార్డు విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే.