
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబాన్ని కరోనా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే కరోనా వేరియంటైనా డెల్టా వైరస్ బారిన పడి ప్రస్తుతం గంగూలీ హోంక్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన కూతురు సనాకు కూడా కరోనా సోకింది. ఆమెకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం సనా ఐసోలేషన్లో చికిత్స పొందతుంది. అయితే గంగూలీ భార్య డోనాకు మాత్రం వైరస్ సోకలేదు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్గా తేలింది. గతంలో గంగూలీ సోదరుడు కూడా కరోనా బారిన పడ్డాడు.
డిసెంబర్లో గంగూలీ కరోనా బారిన పడడంతో కోల్కతాలోని వుడ్ల్యాండ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ సమయంలో గంగూలీకి స్వల్ప లక్షణాలు కూడా ఉన్నాయి. ఆసుపత్రిలో గంగూలీకి "మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్" థెరపీని నిర్వహించారు. అనంతరం ఇంటికి తరలించి హోంక్వారంటైన్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో దాదాకు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు సోకింది కరోనాలోని డెల్టా వేరియంట్ అని నిర్దారణ అయింది.
దీంతో దాదాకు మరిన్ని జాగ్రత్తలతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. త్వరలోనే గంగూలీ పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. అయితే గంగూలీ ఏడాది వ్యవధిలోనే మూడు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. 2021 జనవరిలో వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో కోల్కతాలోని వుడ్ల్యాండ్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఛాతీలో మళ్లీ నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. గుండె రక్త నాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు యాంజియోఫ్లాసీ చికిత్స చేశారు. సమస్య తీవ్రంగా ఉన్న చోట స్టంట్ వేశారు.
కరోనాతో భారత్లో అనేక క్రికెట్ టోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ నెల 13 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ, మహిళల టీ20 ట్రోఫి కూడా వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఇవి వచ్చే నెలలోనే జరగాల్సి ఉంది. ఈ నెలాఖర్లో జరగాల్సిన జాతీయ యూత్ అథ్లెటిక్స్ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య వాయిదా వేసింది. అయితే ఇవన్ని తిరిగి ఎప్పుడూ జరిగేది వెల్లడించలేదు.