
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టులో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు బౌలర్లవే. అది కూడా చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరే. ఈ పర్యటనలో వాళ్లు కీలకపాత్ర పోషించారు. ఏ ఒక్క చిన్న పొరబాటు చేసినా చాహల్ను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ వరకూ విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. అయితే సఫారీ జట్టుతో టీ20 మ్యాచ్ ఆడుతుంది.
అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు హాజరుకానుంది. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ పర్యటనలో కుల్దీప్కు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరాడు.
'ఈ ఏడాది జులైలో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 సిరీస్ల కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్తో టెస్టులాడే భారత జట్టులో కుల్దీప్కు స్థానం కల్పించాలి. ఇది మనకు ఎంతో సాయపడుతోంది. ప్రస్తుతం సఫారీ గడ్డపై కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు' అని కుల్దీప్ను సిఫారసు చేశాడు.
'ఇంగ్లాండ్ గడ్డపై రాణించాలంటే అశ్విన్, జడేజాకు కాస్త కష్టమే. ఇద్దరిలో అశ్విన్కు మరీ కష్టం. ఇంతకుముందు సైతం అతను టెస్టుల్లో పెద్దగా రాణించలేదు. మణికట్టు స్పిన్నర్లు క్రికెట్ ప్రపంచాన్ని ఎప్పుడూ శాసిస్తూనే ఉంటారు. గతంలో ఆసీస్కు చెందిన షేన్ వార్న్ ప్రత్యర్థి జట్లపై ఎంతటి ఆధిపత్యాన్ని చెలాయించాడో అందరికీ తెలిసిందే' అని గంగూలీ తెలిపాడు.
అలా అని తన ఉద్దేశం షేన్ వార్న్తో సమానమైన స్థాయి అని చెప్పట్లేదని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు కుల్దీప్ రెండు టెస్టులు ఆడాడు. ఒకటోది ఆస్ట్రేలియా జట్టుతో సొంత గడ్డపై, రెండోది శ్రీలంక జట్టుతో ఆడి మొత్తం తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.
జులైలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. దీనికి ముందు సొంతగడ్డపై అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు ఆడి అనంతరం ఐర్లాండ్ వెళ్లి ఆతిథ్య దేశంతో రెండు టీ20లు ఆడనుంది.