హైదరాబాద్: యువరాజ్ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామని, అతను రాణిస్తాడనే నమ్మకముందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్తో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల సిరీస్లకు టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చోటు దక్కించుకున్నాడు.
యువరాజ్ సింగ్ను తిరిగి జట్టులోకి తీసుకోవడం పట్ల గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. యువీని రెండు ఫార్మాట్లలో ఎంపిక చేస్తూ జాతీయ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనదేనని దాదా చెప్పుకొచ్చాడు. 'యువరాజ్కు జట్టులో చోటు కల్పించడం నిజంగా మంచి పరిణామమే. రెండు ఫార్మాట్లలో యువీని ఎంపిక చేసి అతనిపై విశ్వాసం ఉంచారు. నాకు కూడా యువీపై నమ్మకం ఉంది. యువీ కచ్చితంగా రాణిస్తాడు. ఈ సిరీస్లో విజయవంతం అవుతాడు' అని జట్టు ప్రకటన అనంతరం గంగూలీ అన్నాడు.
2013 డిసెంబర్లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుకు దూరంగానే ఉన్నాడు. భారత జట్టులోకి మళ్లీ వస్తానని, నీలం రంగు జెర్సీ ధరిస్తానని గతంలో యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడు అనుకున్నట్లే జట్టులోకి పునరాగమనం చేశాడు.

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో యువీ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. జట్టులోకి యువరాజ్ని తీసుకోవాలంటూ సెలక్టర్లకు కోహ్లీ సూచించడంతో అతడికి మార్గం సుగుమైందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ జట్టుపై మొత్తం 34 వన్డేలాడిన యువీ 48.62 సగటుతో 1313 పరుగులు చేశాడు.
ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2007లో తొలిసారి జరిగిన వరల్డ్ ట్వంటీ 20లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ సత్తా చాటాడు. ప్రత్యేకంగా స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలచిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు చివరకు రెండు ఫార్మాట్లలో చోటు కల్పించారు.
దేశవాళీ క్రికెట్లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి తీసుకోవడం జరిగిందని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు.