హైదరాబాద్: ఆతిథ్య జట్లకు అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో టెస్టుల్లో 'టాస్'ను ఎత్తివేయాలన్న ప్రతిపాదనను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యతిరేకించాడు. 'ఈ ఆలోచన అమల్లోకి వస్తుందో రాదో కానీ, టాస్ ఎత్తివేతను మాత్రం వ్యక్తిగతంగా నేను సమర్థించను. ఒకవేళ ఆతిథ్య జట్టు టాస్ గెలవకుంటే దానికి ప్రయోజనాలు దక్కవు కదా?' అని వ్యాఖ్యానించాడు.
అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్షిప్ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. భారత్లో కూడా దేశవాళీ క్రికెట్లో టాస్కు స్వస్తి చెప్పాలంటూ గతంలో ప్రతిపాదనలు రాగా, బీసీసీఐ వాటిని పక్కనపెట్టింది. మరోవైపు ఇంగ్లిష్ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్ లేకుండా బ్యాటింగ్, బౌలింగ్ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు.
1877 నుంచి టెస్టుల్లో అమల్లో ఉన్న టాస్ పద్ధతి రద్దుపై ఈ నెల 28, 29న ముంబైలో సమావేశం కానుంది. దిగ్గజ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటిల్బరో, ఐసీసీ రిఫరీలు రంజన్ మదుగలే, షాన్ పొలాక్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే, ఇటీవలి కాలంలో పిచ్లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానం ఆతిథ్య జట్టుకే ఎక్కువ మేలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో టాస్ తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచనలు చేస్తోంది.