
ఢిల్లీ: టీమిండియా యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ను ఒకసారి మందలిస్తేనే మెరుగవుతాడు అని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు యాజమాన్యం అతడికి అండగా నిలిస్తుందని, అలా కాకుండా ఒకసారి మందలించాలని సూచించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టుకి ఎంఎస్ ధోనీ దూరమవగా.. అతని స్థానంలో గత ఏడాది చివరి వరకూ అవకాశం దక్కించుకున్న పంత్.. ఆశించిన మేర రాణించలేకపోయాడు. దాంతో ఈ ఏడాది ఆరంభం నుంచి కేఎల్ రాహుల్కి కీపర్గా టీమిండియా మేనేజ్మెంట్ అవకాలు ఇచ్చింది.
రిషబ్ పంత్కి కెప్టెన్ విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాడు. కానీ పంత్ మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీలు బాదిన పంత్.. వన్డే, టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. దాంతో ఇప్పుడు టీమిండియాలో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారిపోయింది. కోహ్లీతో పాటు టీమిండియా మేనేజ్మెంట్ మరొక ఛాన్స్ పంత్కు ఇవ్వాలని సూచిస్తూనే.. మందలిస్తేనే దారిలోకి వస్తాడని ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు.
'రిషబ్ పంత్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి యంగ్ క్రికెటర్, చాలా టాలెంట్ ఉన్న ఆటగాడిగా అందరూ అంటున్నారు. దాంతో అతనిపై అంచనాలు పెరిగిపోతూవచ్చాయి. ఒక్కసారి దృష్టి సారించడం మానేస్తే అది అతడికే మంచి చేస్తుంది. స్వేచ్ఛగా రాణించే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ అతిగా రిషబ్ పంత్కి మద్దతు ఇవ్వడంతో అందరి చూపు కూడా పంత్పై నిలిచింది. ఇప్పటికీ పంత్కి వెనుకవైపు నుంచి కోహ్లీ లేదా మేనేజ్మెంట్ ఒక్క కిక్ ఇవ్వగలిగితే దారిలోకి వస్తాడు. ఒకవేళ నిజంగా యువ క్రికెటర్కు మంచి నైపుణ్యం ఉంటే అప్పుడు కచ్చితంగా రాణిస్తాడు' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
కరోనా వైరస్ లాక్డౌన్ చాలా మంది ఆటగాళ్లకు కలిసి వచ్చిందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఈ విశ్రాంతితో ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా ఉత్తేజితులై ఉండొచ్చని మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. అందరూ జరగబోయే మ్యాచులలో రెట్టించిన ఉత్సహంతో ఆడుతారన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో పంత్ ఇప్పటివరకు 13 టెస్టుల్లో, 16 వన్డేల్లో, 28 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు ఫార్మాట్లో మాత్రమే రెండు శతకాలు బాదాడు.
కరోనా పుణ్యమా అని నాలుగు నెలల పాటు ఇంటికే పరిమితమైన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఇటీవలే మళ్లీ బ్యాటు పట్టి సాధన చేస్తున్నాడు. టీమిండియా వెటరన్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనాతో కలిసి అతని సొంత మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సుదీర్ఘ విరామంతో బద్దకం పెరిగిపోయిందని, అయితే తిరిగి ప్రాక్టీస్ చేయడం చాలా ఆనందంగా ఉందని పంత్ తెలిపాడు.