కొన్నిసార్లు సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడంతే..రావడం మాత్రం పక్కా!వార్నర్కు మద్దతుగా నిలిచిన భారత క్రికెటర్!

దుబాయ్: మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 ముగిసింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం (నవంబర్ 14) జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ఆడాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభం ఇస్తే.. మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టును గెలిపించాడు. వన్డే ఫార్మాట్లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్కు టీ20ల్లో ఇదే తొలి టైటిల్. దాంతో ఆసీస్ ప్లేయర్స్ అందరూ సంబరాల్లో ముగిపోయారు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా వార్నర్:
ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషించాడు. మెగా టోర్నీలో డేవిడ్ భాయ్ 289 పరుగులు చేశాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచుల్లో వార్నర్ అద్భుత ఇన్నింగ్స్లు ఆడాడు. సెమీస్లో పాకిస్థాన్పై 49, ఫైనల్లో 53 పరుగులు చేసి జట్టు ఛేజింగ్ను సులభతరం చేశాడు. ఈ క్రమంలోనే 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు ఆసీస్ క్రికెట్లో వార్నర్ ఓ ట్రెండింగ్ టాపిక్. అయితే ప్రపంచకప్ ముందు జరిగిన ఐపీఎల్ 2021లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే 11 మందిలో చోటుకోల్పోయిన వార్నర్ను.. ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. వీరందరికీ డేవిడ్ భాయ్ తన బ్యాటుతో సమాధానమిచ్చాడు. తనను ఎవరూ తక్కువగా అంచనావేయొద్దని నిరూపించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడంతే:
'జీవితంలో కానీ, ఆటలో కానీ ఓటమి ఒప్పుకోకూడదు. డేవిడ్ వార్నర్ను చూడండి.. ఐపీఎల్ 2021 జట్టులో ఆడటానికి కూడా సరిపోని స్థాయి నుంచి టీ20 ప్రపంచకప్ 2021లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కొన్నిసార్లు సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడంతే. రావడం మాత్రం పక్కా' అని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. మెగా టోర్నీలో వార్నర్ ఆడిన 7 మ్యాచ్ల్లో 289 పరుగులు చేసి ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 303 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్నర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

నెల రోజులు తిరగకముందే:
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 14 సీజన్లో తేలిపోయాడు. అటు కెప్టెన్గా, ఇటు బ్యాట్స్మన్గా విఫలమయ్యాడు. భారత్లో జరిగిన తొలి అర్ధ భాగంలో ఫర్వాలేదనిపించిన దేవ్.. యూఏఈలో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో రెండు అర్ధ శతకాలతో 195 పరుగులు చేశాడు. ఇక హైదరాబాద్ టీం ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ యాజమాన్యం వార్నర్ను పక్కనపెట్టి.. కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలియమ్సన్కు అప్పగించింది. అంతేకాకుండా తుది జట్టులో అవకాశమే ఇవ్వలేదు. వాటన్నింటిని వార్నర్ పెద్దగా పట్టించుకోలేదు. తనని తుది జట్టులో నుంచి తొలగించినా.. డగౌట్లో కూర్చొని జట్టు విజయాల కోసం మద్దతిచ్చాడు. ఇక ఐపీఎల్ ముగిసి సరిగ్గా నెల రోజులు తిరగకముందే ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్లోవార్నర్ ఏకంగా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications