
ముంబై: లండన్లోని లార్డ్స్ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)నే టార్గెట్గా చేసుకున్నారాయన. ఐసీసీ నిబంధనలపై నిశితంగా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. అన్ని కాకపోయినా క్రికెట్ సంబంధించిన కొన్ని నిబంధనల్లో మార్పులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఐసీసీ నిబంధనల వల్లే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిందంటూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్న విషయం తెలిసిందే. లక్షలాదిమంది క్రికెట్ అభిమానులు.. ఐసీసీ నిబంధనలను తప్పుపడుతూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. వాటన్నింటికీ కేన్ విలియమ్సన్ పేరును ట్యాగ్ చేయడం వల్ల ఆయన పేరు ట్రెండింగ్లో నిలిచింది. అందరు అభిమానుల తరహాలోనే రోహిత్ శర్మ కూడా ఐసీసీ నిబంధనలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వాటిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం, ఐసీసీ నిబంధనలపై ఓ భారతీయ క్రికెటర్ నోరు విప్పడం ఇదే తొలిసారి.