అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయిదు దశాబ్దాల నాటి కల ఇవాళ సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్యతో పాటు దేశమంతా భక్తి పారశవ్యంలో మునిగిపోయంది. పండగ వాతావరణం నెలకొంది. అయితే ఈ చారిత్రక రోజున స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మను కొందరు నెట్టింట్లో దారుణంగా అవమానిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. రామ మందిర ప్రారంభోత్సవానికి సుమారు ఏడు వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఇందులో ఉన్నారు. సచిన్ టెండూల్కర్, రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్ వంటి క్రీడా ప్రముఖులు అయోధ్యకు చేరుకుని శ్రీరాముడి సేవలో పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు, నెట్టింట్లో వైరల్గా మారాయి.

మరోవైపు అయోధ్యకు ఆదివారం రాత్రినే విరాట్ కోహ్లి బయలుదేరాడని వార్తలు వచ్చాయి. కానీ అయోధ్యకి వచ్చినట్లుగా కోహ్లికి సంబంధించిన ఫొటో బయటకు రాకపోవడంతో కొందరు నెటిజన్లు అనుష్క శర్మను నిందిస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టంలో కోహ్లి భాగస్వామి కాకపోవడానికి అనుష్కనే కారణమంటూ దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో అనుష్క పేరు ట్విటర్లో ట్రెండింగ్లోకి వచ్చింది.
అయితే వామిక విషయంలో విరుష్క దంపతులు చేసిన అభ్యర్థన దృష్టిలో పెట్టుకొని.. అయోధ్యకు వచ్చిన కోహ్లి ఫ్యామిలీ ఫొటోలు మీడియా బయటపెట్టలేదని కొందరు వాదిస్తున్నారు. వామిక జన్మించిన తర్వాత తన కూతురు ఫొటోలు లీక్ చేయొద్దని విరాట్, అనుష్క మీడియాను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా కోహ్లి వచ్చినా ఆ కారణంతోనే ఫొటోలు బయటకు రాలేదని అంటున్నారు.
కాగా, కోహ్లి అయోధ్యకు రాకపోతే అసలు తప్పేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ అయోధ్యకు రాలేదని, కానీ ఆ క్రికెటర్లను ఎందుకు తప్పుపట్లేటదని కోహ్లి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల అఫ్గానిస్థాన్ జరిగిన తొలి టీ20కి కోహ్లి దూరమైనప్పుడు కూడా కోహ్లిని కొందరు దారుణంగా విమర్శిస్తూ నెట్టింట్లో ట్రోల్ చేశారు. వామిక బర్త్ డే కోసం దేశం తరపున మ్యాచ్ ఆడకపోవడమేంటని విమర్శించారు.
అయితే ఇప్పుడు అయోధ్య వేడుకకు కోహ్లి గైర్హాజరు విషయంలో అనుష్కను కొందరు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని కోహ్లి ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్లా క్రికెట్లోనూ ఉందని, అందుకే ఇతర స్టార్ ప్లేయర్ల ఫ్యాన్స్ హద్దులు దాటి ఉన్మాదుల్లా అనుష్కను కామెంట్లు చేస్తున్నారని, ఇలా చేయడం సరికాదని అంటున్నారు. అయితే అనుష్క శర్మ అయోధ్యకు వచ్చినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.