హైదరాబాద్: జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది. మేటి జట్లకు సాధ్యం కాని అరుదైన రికార్డుని సొంతం చేసుకుని ఔరా అనిపించింది. శ్రీలంకను వారి సొంతగడ్డపైనే షాకిచ్చి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 316 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (86), తరంగ (79 నాటౌట్), గుణతిలక (60) అర్ధ సెంచరీలతో రాణించగా, మాథ్యూస్ (43) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్ తెందాయ్ చతర 2 వికెట్లు తీశాడు.

అనంతరం 317 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 47.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సలోమన్ మిర్ (96 బంతుల్లో 112; 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. సోలోమన్కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం.
46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీన్ విలియమ్స్(65)తో కలిసి మూడో వికెట్కు ఓపెనర్ సోలోమన్ మైర్ 161 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో ఆఖర్లో సికిందర్ రజా (67 నాటౌట్), వాలర్ (40 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టును గెలుపుతీరాలకు చేర్చారు.
శ్రీలంకలో ఇప్పటిదాకా 296 వన్డేలు జరిగితే ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. లంక బౌలర్లలో గుణరత్నే 2 వికెట్లు తీశాడు. సెంచరీతో కదం తొక్కిన సోలోమన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.