

హైదరాబాద్: 'గోల్డ్' సినిమాకు తాను అమ్ముడైపోయినట్లు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రీమా కట్గి దర్శకత్వం వహించారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్వహించిన ఒలింపిక్స్లో హాకీ జట్టు స్వర్ణం సాధించింది.
దీనిపై ఈ సినిమాను తెరకెక్కించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీలో వీరేంద్ర సెహ్వాగ్ తన కుటుంబంతో కలిసి 'గోల్డ్' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ను వీక్షించారు. ఈ విషయాన్ని సెహ్వాగ్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
"మమ్మల్ని స్పెషల్ స్క్రీనింగ్కు ఆహ్వానించినందుకు అక్షయ్కు ధన్యవాదాలు. నేను 'గోల్డ్'కు అమ్ముడుపోయాను. ఇందులోని నటీనటులంతా అద్భుతంగా నటించారు. సినిమా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద సినిమా బాగా ఆడి మరెందరో ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను" అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా అక్షయ్ కుమార్తో కలిసి దిగిన ఫొటోను సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నారు. సెహ్వాగ్ ట్వీట్కు అక్షయ్ కూడా స్పందించారు. "సినిమా చూడటానికి వచ్చినందుకు ధన్యవాదాలు వీరూ పాజీ.. మీకు సినిమా నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది" అని అన్నారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ స్క్రీనింగ్కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, వీరేందర్ సెహ్వాగ్, హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ తదితరులు హాజరయ్యారు.