హైదరాబాద్: న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోథీ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో జమైకా తల్లవాస్ జట్టు తరుపున ఆడనున్నాడు. ఈ మేరకు ఆ జట్టు యాజమాన్యం నుంచి ఇష్ సోథీకి పిలుపు వచ్చింది.
ప్రస్తుతం జమైకా తల్లవాస్ జట్టు తరుపున ఆడుతోన్న ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా దేశవాళీ సీజన్ కోసం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. దీంతో ఆడమ్ జంపా స్థానాన్ని ఇష్ సోథీతో భర్తీ చేశారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ఇష్ సోథీ అడటం ఇదే మొదటిసారి.
కంట్రీ క్రికెట్లో నాటింగ్హామ్ షైర్ జట్టు తరుపున 15 మ్యాచ్లాడిన ఇష్ సోథీ 19 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అంతేకాదు ఆ జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరడంలో కూడా కీలకపాత్ర పోషించాడు. 2018 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున బరిలోకి దిగాడు.
ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ జహీర్ ఖాన్ గాయం కారణంగా 2018 ఐపీఎల్ సీజన్కు దూరం కావడంతో అతడి స్థానంలో ఇష్ సోథీని యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటికే జమైకా తల్లవాస్ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
నాకౌట్కు ముందు రెండో స్థానం కోసం జమైకా తల్లవాస్ జట్టు గుయానా అమెజాన్ వారియర్స్ జట్టుతో తలపడనుంది. మరోవైపు సెయింట్ కిట్టీస్, నెవీస్ పెట్రియాట్స్ జట్లు పరస్పరం తమ లెగ్ స్పిన్నర్లు అయిన సందీప్ లమిచానే, తబ్రీజ్ షంసీలను మార్చుకున్నాయి.
ఈ విషయాన్ని తబ్రీజ్ షంసీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దక్షిణాప్రికాకు చెందిన తబ్రీజ్ షంసీ ఇటీవలే భారత్లో దక్షిణాఫ్రికా-ఏ జట్టు తరుపున పలు మ్యాచ్లు ఆడాడు. వెన్ను నొప్పి కారణంగా కేవలం రెండు 50 ఓవర్ల మ్యాచ్లను మాత్రమే ఆడటం జరిగింది.
So good to be back in the Caribbean with the @sknpatriots once again for the @CPL #BiggestPartyInSport 🕺 pic.twitter.com/UZHrhpteNr
— Tabraiz Shamsi (@shamsi90) September 3, 2018