
హైదరాబాద్: లండన్లో భారత హైకమిషన్ ఇచ్చిన విందు అనంతరం టీమిండియాతో దిగిన ఫోటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఉండటాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్, సహాయ సిబ్బంది ఈ విందుకి హాజరవగా.. కెప్టెన్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లింది.
అయితే ఫొటో తీసుకునే సమయంలో కోహ్లీ, అనుష్క శర్మ మొదటి వరుసలో నిలబడగా.. వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే నాలుగో వరుసలో నిలబడ్డాడు. దీంతో అభిమానులు టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్ అయ్యారు. అనుష్క శర్మకి ఇచ్చిన గౌరవం కూడా భారత్ జట్టు వైస్ కెప్టెన్కి ఇవ్వరా? అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
"అనుష్క ఏమన్నా టీమిండియా వైస్ కెప్టెనా? జట్టులో ఆమె ఎందుకు ఉంది?" అంటూ కామెంట్లు కూడా చేశారు. తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. క్రికెటర్లు ఇష్టపూర్వకంగానే వారి బంధువులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారని పేర్కొంది. "భారత హైకమిషన్.. క్రికెటర్లను, వారి బంధువులను ఆహ్వానించింది. ఫొటో దిగే సమయంలో ఆటగాళ్లు ప్రొటోకాల్ను అతిక్రమించలేదు" అని పేర్కొంది.
"క్రికెటర్లు ఎవరితోనైనా ఫొటోలు దిగొచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. లండన్లో జరిగే మ్యాచ్లకు ఆటగాళ్లు వారి బంధువులతో హాజరుకావచ్చు. రిసెప్షన్ నిమిత్తం హై కమిషనర్, ఆయన సతీమణి ఆహ్వానిస్తేనే అనుష్క వేడుకకు హాజరయ్యారు. హై కమిషనర్ అధికారిక నివాసంలోకి ప్రవేశించబోతున్న సమయంలో ఈ ఫొటో తీశారు. ఇక, రహానే విషయానికొస్తే అతను ఇష్టప్రకారమే వెళ్లి వెనక నిలబడ్డాడు" అని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గురువారం రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ సిరిస్లో ఇప్పటికే ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.