
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సత్తా చాటింది. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారింగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. 2021లో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన 38 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది స్వదేశంలో సౌతాఫ్రికాతో భారత మహిళా జట్టు 8 మ్యాచ్లు ఆడింది. కానీ అందులో 2 మాత్రమే గెలిచింది. అయితే ఈ రెండు విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేలో సౌతాఫ్రికా విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో స్మృతి 80 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను విజయ తీరాలకు చేర్చింది.
అలాగే సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ను గెలవడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్లో స్మృతి 48 పరుగులతో అజేయంగా నిలిచింది. అంతేకాకుండా ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ను డ్రా చేయడంలో సహకరించింది. ఈ మ్యాచ్లో స్మృతి 78 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. అలాగే ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత్ గెలిచిన ఏకైక వన్డేలో ఆమె 49 పరుగులతో రాణించింది. ఒక టీ20 సిరీస్లో ఓ మ్యాచ్లో 15 బంతుల్లోనే 29 పరుగులు చేసిన స్మృతి.. మరో మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించింది. అయితే ఈ టీ20 సిరీస్ను భారత మహిళలు 1-2తో కోల్పోయారు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో స్మృతి మంధాన 86 పరుగులతో రాణించింది. ఇక కంగారులతో జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటింది. ఆమె కెరీర్లో ఇదే తొలి సెంచరీ. స్మృతి సాధించిన సెంచరీతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో స్మృతి మొత్తం 127 పరుగులు చేసింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఆమెనే వరించింది.
ఇక ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టమీ బేమౌంట్ గెలుచుకుంది. ఇక పురుషుల విభాగానికి వస్తే ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికయ్యాడు. అలాగే టీ20 ప్లేయర్ ఆఫ్ ది అవార్డుకు కూడా పాకిస్థాన్కే చెందిన మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఇక వన్డే, టీ20 కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్గా బాబర్ అజామ్ నిలిచాడు.