హైదరాబాద్: స్మృతి మందాన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో వెలుగులోకి వచ్చిన భారత మహిళా క్రికెటర్. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో 90 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక రెండో మ్యాచ్లో ఏకంగా సెంచరీతో అదరగొట్టింది.
దీంతో స్మృతి మందాన పేరు ఒక్కసారిగా మారుమ్రోగి పోయింది. అయితే ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. సెమీఫైనల్ లక్ష్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్లో విఫలమైన స్మృతి డ్రెస్సింగ్ రూమ్లో ఏడ్చేసింది.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ స్మృతి మంధాన (3) స్వల్ప స్కోరుకే గార్డనర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ ఓపెనర్ రౌత్తో కలిసి చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీలు నమోదు చేశారు. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని బీమ్స్ విడదీసింది. మిథాలీని అవుట్ చేసింది.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 157 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓపెనర్ రౌత్ కూడా పెవిలియన్కు చేరింది. హర్మన్ప్రీత్ కౌర్(23) పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ దీనంగా కనిపించింది.
ఈ మ్యాచ్ ఓటమితో సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. దీంతో 15న న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ కీలకంగా మారింది. తాజాగా స్మృతి మందాన కన్నీరు కార్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్మృతి అందమైన నవ్వు చూసి ఆమెపై అభిమానం పెంచుకున్న అభిమానులు ఈ వీడియోని చూసి పాపం అంటున్నారు.
ఇదిలా ఉంటే ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న మిథాలీరాజ్ సేన సెమీస్కు చేరాలంటే శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై తప్పక గెలవాలి.