భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన ఫేవరేట్ ప్లేయర్ ఎవరో చెప్పింది. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మృతి ఆసక్తికర విషయాలు పంచుకుంది. విరాట్ కోహ్లి తనకు ఇష్టమైన బ్యాటర్ అని పేర్కొంది. కోహ్లిని కలిశానని, అతని నుంచి కొన్ని సూచనలు తీసుకున్నానని వివరించింది. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది.
మీ ఫేవరేట్ బ్యాటర్ ఎవరు అని అడగ్గా స్మృతి ఇలా సమాధానమిచ్చింది. ''నా ఫేవరేట్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అతన్ని కలిశాను. అతని బ్యాటింగ్, మైండ్ సెట్ గురించి అడిగాను. అంచనాలను ఎలా అందుకుంటారు? అని అడిగాను. అయితే తాను అంచనాల గురించి పట్టించుకోనని, జట్టుకు ఏం కావాలో దాని గురించే ఆలోచిస్తానని చెప్పాడు. అది విన్న తర్వాత నా మైండ్సెట్ మారిపోయింది'' అని స్మృతి మంధాన పేర్కొంది.

కాగా, ప్రస్తుతం స్మృతి మంధాన మరో నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్కు సన్నద్ధమవుతుంది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రపంచకప్ ముంగిట భారత మహిళ జట్టు ఎన్సీఏలో పది రోజులు నైపుణ్య శిబిరంలో పాల్గొననుంది. రేపటి నుంచి ఈ శిక్షణ కార్యక్రమం మొదలుకానుంది. దీన్ని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ పర్యవేక్షించనున్నారు.
టీ20 వరల్డ్ కప్లో గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకలతో గ్రూప్ దశలో తలపడనుంది. అక్టోబర్ 4 నుంచి భారత్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఉంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా అమీతుమి తేల్చుకోనుంది. అలాగే అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
గ్రూప్ దశ మ్యాచ్ల కంటే ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 29న వెస్టిండీస్తో, అక్టోబర్ 1న సౌతాఫ్రికాతో తలపడనుంది. కాగా, అక్టోబర్ 17, 18న సెమీఫైనల్స్, అక్టోబర్ 20న ఫైనల్ జరగనున్నాయి.