రెండు రూల్స్ పాటించాలి:
ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ స్మృతి' అంటూ సాగిన సంభాషణలో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల స్మృతి మంధాన పలు విషయాలు అభిమానులతో పంచుకుంది. ఒక నెటిజన్ మంధానకు సరదా ప్రశ్నను సంధించగా.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చి అందరిని అలరించింది. మీ జీవిత భాగస్వామి అవ్వడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి అని అడగ్గా... 'రెండు రూల్స్ను తను తప్పకుండా పాటించాలి. నా జీవిత భాగస్వామి కావాలనుకునే వ్యక్తి నన్ను ప్రేమించేవాడై ఉండాలనేది మొదటి షరతు. ఈ మొదటి షరతుకు కావాల్సిన నిబంధనలను పాటించాలనేది నా రెండో షరతు' అని మంధాన చెప్పింది.
అరిజిత్ సింగ్ ఇష్టం:
ప్రస్తుతం మీరు ఒంటరిగా ఉన్నారా అని ప్రశ్నించగా.. 'ఏమో చెప్పలేను, నాకైతే తెలీదు' అని మంధాన తెలివిగా సమాధానం ఇచ్చింది. 'చిన్నప్పుడు నాకిష్టమైన కార్టూన్ల జాబితాలో నాడీ, బాబ్ ద బిల్డర్, నింజా హటోరి ఉన్నాయి. ఇప్పుడు కూడా సమయం దొరికితే వాటిని చూస్తుంటా' అని మరొకరికి తెలిపింది. అరిజిత్ సింగ్, ప్రతీక్ బచ్చన్ ఇష్టమైన గాయకులు అని కూడా మంధాన చెప్పింది.
ఇంట్లో వాళ్లే అలసిపోయారు:
'సరదాగా చెప్పాలంటే నా మొహం ఇన్ని రోజులు చూస్తూ మా ఇంట్లో వాళ్లే అలసిపోయారు. ఎప్పుడెప్పుడు తర్వాతి టోర్నీ ఉంటుందా అంటున్నారు. అయితే ఈ సమయాన్ని చాలా బాగా గడుపుతున్నామనేది మాత్రం వాస్తవం' అని మంధాన పేర్కొంది. 'నాకు దగ్గరలో జెమీమా లేకపోవడం వల్ల లోటేమీ తెలియడం లేదు. ఇంకా కాస్త ప్రశాంతంగా ఉంటున్నా' అని అంది. 'గతంలో కళ్లద్దాలు పెట్టుకొని బ్యాటింగ్ చేసేదాన్ని. అయితే 2017లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కాంటాక్ట్ లెన్స్లను వాడటం అలవాటు చేసుకున్నా' అని మంధాన చెప్పుకొచ్చింది.
క్వారంటైన్లో మంధాన:
ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో స్మృతి మంధాన పాల్గొంది. ఈ టోర్నీలో అంచనాలను అందుకోవటంలో ఆమె విఫలమైంది. ఫైనల్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. భారత్ 85 పరుగుల తేడాతో ఫైనల్లో ఓడిన విషయం తెలిసిందే. ఇటీవలే ముంబై నుంచి తన సొంత ఊరు సాంగ్లీకి తిరిగి వచ్చిన మంధాన.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంది.