భారత మహిళా స్టార్ క్రికెట్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. చాలా ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోంది. వారి నిశ్చితార్థ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు వారికి శుభాకాంక్షలు చెబుతూ ప్రేమను కురిపిస్తున్నారు.
డీవై పాటిల్ స్టేడియంలో ప్రపోజల్
పలాష్ ముచ్ఛల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ అద్భుత ఘట్టం ఉంది. పలాష్, స్మృతి మంధాన కళ్లకు గంతలు కట్టి ఆమెను డీవై పాటిల్ స్టేడియం మధ్యలోకి తీసుకువెళ్లారు. అదే స్టేడియంలో స్మృతి మంధాన గతంలో మహిళల ప్రీమియర్ లీగ్లో (WPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడారు. ఆ మైదానంలోనే ఆమె కళ్లపై ఉన్న గంతలు తొలగించి మోకాళ్లపై కూర్చుని ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశారు. ఈ అనూహ్యమైన సర్ప్రైజ్కు స్మృతి ఉద్వేగానికి లోనయ్యారు. ఉంగరం మార్చుకున్న తర్వాత ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ భావోద్వేగ క్షణాలను అభిమానులు విపరీతంగా ఆస్వాదిస్తున్నారు.

నవంబర్ 23న వివాహం
స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ల వివాహంపై గతంలో పలు పుకార్లు వచ్చినా అవి నిజం కాలేదు. సమాచారం ప్రకారం.. వీరి వివాహం నవంబర్ 23, 2025న జరగనుంది. ఎన్నో ఏళ్ల తమ ప్రేమ బంధాన్ని ఈ జంట జీవితాంతం కొనసాగే బంధంగా మార్చుకోబోతోంది.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఈ శుభసందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియా వేదికగా స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరికీ, ఇరు కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. సంతోషకరమైన జీవితాన్ని, ఒకరికొకరు బాధ్యతలను పంచుకోవాలని ఆకాంక్షించారు. స్మృతి మంధాన అద్భుతమైన కవర్ డ్రైవ్ను ప్రస్తావించారు. చివరగా టీమ్ గ్రూమ్, టీమ్ బ్రైడ్ మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ ఆడి విజయాన్ని పంచుకోవాలని సరదాగా సలహా ఇచ్చారు. ప్రధాని మోదీ ఈ విధంగా వినూత్న శైలిలో శుభాకాంక్షలు చెప్పడం అభిమానులకు బాగా నచ్చింది.