
హైదరాబాద్: భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన 2018 సంవత్సరానికి గాను వన్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకుంది. దీంతో ఒక కేలండర్ ఇయర్లో రెండు ఐసీసీ అవార్డులను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన అరుదైన రికార్డు నెలకొల్పింది.
ఈ మేరకు ఐసీసీ సోమవారం తన ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న మంధాన 1291 పరుగులు చేసింది. వెస్టిండీస్లో మహిళా వరల్డ్ టీ20ల్లో భారత్ సెమీ ఫైనల్ చేరడంలో మంధాన కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో 125పైగా స్ట్రైక్రేట్తో 178 పరుగులు సాధించారు.
12 వన్డేల్లో మంధాన ఏడు హాఫ్ సెంచరీలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంకలలో వరుసగా ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం. 25 టీ20ల్లో 622 పరుగులు చేశారు. దీంతో పాటు ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ వన్డే, టీ20 జట్లలో కూడా మంధాన చోటు దక్కించుకుంది. ప్రస్తుతం స్మృతి మంధాన ఇంగ్లాండ్లో సమ్మర్ను ఎంజాయ్ చేస్తోంది. లాంక్షైర్ థండర్ జట్టు తరుపున 61 బంతుల్లో సెంచరీ సాధించింది.

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కియా సూపర్ లీగ్లో స్మృతి మంధాన మొత్తం 9 ఇన్నింగ్స్లాడి 174 స్టైక్ రేట్తో 421 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది. ఇక, ఇంగ్లాండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.
19 ఏళ్ల సోఫీ ఎక్లెస్టోన్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసింది. 23 పరిమిత ఓవర్ల మ్యాచ్ల్లో మొత్తం 35 వికెట్లు పడగొట్టింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే సిరిస్లో సోఫీ ఎక్లెస్టోన్ స్టార్ ఫెర్మామర్గా నిలిచింది. ఐసీసీ ప్రకటించిన ఈ ఏడాది వన్డే, టీ20 జట్లలో కూడా చోటు దక్కించుకుంది.