
హైదరాబాద్: ఉమెన్స్ సూపర్ లీగ్లో పాల్గొన్న మొదటి భారత మహిళ స్మృతి మంధాన. అసమాన ప్రతిభను చూపించి పరుగుల వరద పారిస్తోన్న ఆమె దూకుడును చూసి టోర్నమెంట్లో ఆమె ఆడేందుకు కుదుర్చుకున్న గడువును మరింత కాలం పొడిగిస్తూ.. వెస్టరన్ స్టోర్మ్ జట్టు నిర్ణయం తీసుకుంది. జట్టులో ఒకరిగా తీసుకున్న మంధాన, ఆరు మ్యాచ్లు ఆడిన తర్వాత ఆమే కీలకంగా మారిపోయింది.
లీగ్ మొత్తానికి అత్యధిక స్కోరు నమోదు చేసిన ప్లేయర్గా రికార్డు కొట్టేసిన ఆమె యార్క్షైర్ జట్టును వెస్టరన్ స్టోర్మ్ ఓడించడానికి కీలకంగా వ్యవహరించింది. అన్ని ఇన్నింగ్స్ కలిపి ఈ లీగ్ మొత్తంలో ఆమె స్కోరు 338పరుగులు. ఈ లీగ్లో మంధాన వరుసగా 48, 37, 52, 43, 102, 56లు నమోదు చేసి అందరినీ ఔరా అనేలా చేసింది. ఈ సూపర్ లీగ్లో అతి తక్కువ బంతుల్లో అంటే 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన మంధాన అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ కూడా పూర్తి చేయగలిగింది. ఇలా అత్యధిక పరుగులు చేసిన రికార్డులను పక్కన బెడితే ఆమె సాధించనవి మరెన్నో ఉన్నాయి.
ఉమెన్ సూపర్ లీగ్ మొత్తానికి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్గా(102), 2018 లీగ్లో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ (85), 2018లోనే అత్యంత వేగవంతమైన స్ట్రైక రేట్ (184), అత్యధిక బౌండరీలు (34), సిక్సులు(19) సాధించి లీగ్ మొత్తానికి టాప్ ప్లేస్ను సొంతం చేసుకుంది. ఇంతేగాక, మంధాన ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 13వ స్థానంలో ఉంది.
వెస్టరన్ స్టోర్మ్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్స్ మాట్లాడుతూ.. జట్టు గెలుస్తామనే ప్రగాఢ నమ్మకంతో ఆడగలుగుతోంది. ప్రత్యేకంగా స్మృతి మంధాన జట్టులో ఉండటమే దీనికి ప్రధాన కారణం. సునాయాసంగా జట్టును గెలిపించేస్తోంది. తన బ్యాట్తో ప్రతి బంతిని అనుకూలంగా మార్చేసుకుంటుంది. దాదాపు ప్రతి బంతిని బౌండరీకి పంపే ప్రయత్నం చేస్తోంది' అని కొనియాడింది.