అగ్రస్థానంలో మంధాన
గత ఏడాది 12 వన్డేలాడి 669 పరుగులు చేసిన మంధానాకి ఐసీసీ ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. 2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకూ 15 వన్డేలాడిన ఈ భారత ఓపెనర్ రెండు సెంచరీలతో పాటు ఎనిమిది హాఫ్ సెంచరీలు సాధించింది. 751 పాయింట్లతో ర్యాంకింగ్స్లో మంధాన అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత పెర్రీ (681) మెక్ లానింగ్ (675) టాప్-3లో ఉన్నారు.
ఐదో స్థానానికి పరిమితమైన మిథాలీ
మరోవైపు తన కెరీర్లో 200 వన్డేల మైలురాయిని అందుకున్న మిథాలీ రాజ్ 669 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. మరో బ్యాట్స్ వుమెన్ జెమీమా రోడ్రిగ్జ్ కూడా తన ర్యాంకుని మెరుగుపరచుకుంది. దీంతో తాజా ర్యాంకింగ్స్లో 64 స్థానం నుంచి 61 స్థానానికి ఎగబాకింది. తొలి వన్డే 81 పరుగులు చేసి ఆకట్టుకుంది.
తన ర్యాంకుని మెరుగుపరచుకున్న జెమీమా రోడ్రిగ్జ్
గతేడాది మార్చిలో అరంగ్రేట్రం చేసిన జెమీమా ఇప్పటికి కేవలం ఏడు వన్డేలు మాత్రమే ఆడింది. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు పూనమ్ యాదవ్, దీప్తి శర్మ ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని 8, 9 స్థానాల్లో నిలిచారు. కివీస్తో జరిగిన వన్డే సిరీస్లో పూనమ్ ఆరు వికెట్లు తీయగా, దీప్తి నాలుగు వికెట్లు పడగొట్టింది.
టాప్-5లో జులన్ ఒక్కటే
ఏక్తా బిస్త్ 13 స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జులన్ గోస్వామి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-5 మంది బౌలర్లలో నిలిచిన ఏకైక టీమిండియా బౌలర్ జులన్ ఒక్కటే కావడం విశేషం. ఆల్రౌండర్ విభాగంలో దీప్తి శర్మ 329 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.