
హైదరాబాద్: జోహెన్స్బర్గ్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జరిగిన మూడో టీ20లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన తన అద్భుతమైన ఫీల్డింగ్తో అభిమానులను ఆకట్టుకుంది. ఆదివారం సఫారీ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 17.5 ఓవర్లకు గాను 133 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో అనుజ పాటిల్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదవ ఓవర్ నాలుగో బంతిని దక్షిణాఫ్రికా బ్యాట్స్ ఉమన్ డు ప్రీజ్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్గా మలిచింది. ఈ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మందాన బంతిని బౌండరీ లైన్ వద్ద బంతికి అమాంతం గాల్లోకి ఎగిరి ఒడిసి పట్టుకుంది.
అయితే బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్కి అవతలి వైపు పడే సమయంలో బంతిని మైదానంలోకి విసిరేసింది. దాంతో ఆ బంతికి ఒక్క పరుగు మాత్రమే రావడంతో మందాన ఐదు పరుగుల్ని ఆదా చేసింది. అయితే ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
క్రికెట్లో గెలుపు, ఓటములు సహజమే అయినప్పటికీ స్మృతి మందాన క్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే మహిళల మ్యాచ్ అనంతరం జరిగిన పురుషుల మ్యాచ్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ బుమ్రా ఇదే తరహాలో క్యాచ్ పట్టాడు.
హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద బుమ్రా గాల్లోకి ఎగిరి మరీ అందుకున్నాడు. బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో బంతిని విసిరేసి బౌండరీ లైన్పై పడ్డాడు. కానీ దానిని సిక్సర్గా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఇటీవల క్రికెట్లో మార్చిన నిబంధనల ప్రకారం తొలుత ఒకసారి బౌండరీ లైన్ తాకి ఆపై గాల్లో క్యాచ్ పట్టి విసిరేసినా అది సిక్సర్గానే పరిగణిస్తారు. దీంతో బుమ్రా ఒకింత నిరాశకు గురయ్యాడు.