భారత మహిళా స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. దీంతో రెండ్రోజుల పాటు సంగీత్, హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలతో కళకళలాడిన స్మృతి మంధాన ఇంట్లో వివాహ వేడుక ఆగిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో స్మృతి మంధాన పెళ్లి ఆదివారం మధ్యాహ్నం జరగాల్సి ఉండగా.. పెళ్లి రోజు ఉదయం స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం విషమించడంతో పెళ్లిని వాయిదా వేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
చికిత్స అందిస్తోన్న వైద్యులు
స్మృతి తండ్రి శ్రీనివాస్ను ఆదివారం మధ్యాహ్నం సాంగ్లీలోన ఓ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో యాంజినా పెక్టోరిస్ అంటారు. ఇది గుండె సంబంధిత సమస్యల వల్ల వచ్చే ఛాతీ నొప్పి రకం. ఆసుపత్రిలోని న్యూరో ఫిజీషియన్, ఛైర్మన్ డా. నమన్ షా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో మాట్లాడుతూ.. "ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు యాంజినా వచ్చింది. 2.15 గంటలకు మా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ (ICU)లో ఉన్నారు. మేము కొన్ని పరీక్షలు నిర్వహించి మందులు ప్రారంభించాం" అని తెలిపారు. డాక్టర్ నమన్ షా మాట్లాడుతూ, "సోమవారం ఉదయం మరిన్ని పరీక్షలు చేసి, యాంజియోగ్రఫీ అవసరమా లేదా అనేది నిర్ణయిస్తాం" అని వెల్లడించారు.

శ్రీనివాస్ను హృద్రోగ నిపుణుడు డా. రోహిత్ థాన్దార్ పరీక్షించారు. ఈసీజీలో కొత్తగా ఆందోళనకరమైన విషయాలు ఏమీ లేవని.. అయినప్పటికీ ఆయన రక్తపోటు కొద్దిగా పెరిగినందున, వైద్యులు ఆయనను పర్యవేక్షణలో ఉంచారు.
ఆరేళ్ల ప్రేమ బంధం
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ గత ఆరేళ్లుగా ప్రేమబంధంలో ఉన్నారు. ఇటీవల భారత జట్టు మహిళల ప్రపంచ కప్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత డీవై పాటిల్ స్టేడియం పిచ్పైకి వెళ్లి పలాష్, స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ వీడియోను కూడా వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమానులు ఈ వివాహం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఊహించని పరిణామం కారణంగా వారి పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడింది.