భారత మహిళా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ల వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడమే దీనికి కారణం.
తండ్రి ఆరోగ్యం క్షీణత.. ఆస్పత్రిలో చేరిక
ఆదివారం(నవంబర్ 23) ఉదయం శ్రీనివాస్ మంధాన తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా.. హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు మొదట కొద్దిసేపు వేచి చూసినప్పటికీ.. ఆయన పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటనే అంబులెన్స్లో మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు జరగాల్సిన వీరి వివాహ వేడుకను వాయిదా వేయాలని స్మృతి మంధాన కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

స్థిరంగా స్మృతి తండ్రి ఆరోగ్యం
ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీనివాస్ మంధాన ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉంది. ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదు. మెరుగైన నిర్ధారణ కోసం వైద్యులు ఆయనకు యాంజియోగ్రఫీ కూడా నిర్వహించారు. ఇందులో గుండెకు రక్త ప్రసరణలో ఎటువంటి అడ్డంకులు లేవని తేలింది. అన్ని పరీక్షలు, చికిత్సల అనంతరం శ్రీనివాస్ మంధానను మంగళవారం (నవంబర్ 25, 2025) నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తన తండ్రి ఆరోగ్యం కోలుకోవడమే తనకు ముఖ్యమని, ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులైన తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్మృతి మంధాన స్పష్టంగా చెప్పినట్లు ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ధ్రువీకరించారు.
కాబోయే భర్తకూ స్వల్ప అస్వస్థత
ఆదివారం నాటి ఈ అవాంఛనీయ సంఘటనలో వధువు తండ్రి మాత్రమే కాదు, కాబోయే భర్త పలాష్ ముచ్ఛల్ కూడా స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు ఎసిడిటీ సమస్య తలెత్తడంతో కొద్దిసేపు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన పరిస్థితి తీవ్రంగా లేకపోవడంతో వెంటనే డిశ్చార్జ్ అయ్యారు.
పెళ్లిపై సందేహాలు.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు
పెళ్లి వాయిదా పడిన నేపథ్యంలో స్మృతి మంధాన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి గతంలో పోస్ట్ చేసిన తన నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను తొలగించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అభిమానుల్లో వివాహం జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ వివాహానికి సంబంధించిన కొత్త తేదీ గురించి వారి కుటుంబాలు లేదా మేనేజ్మెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ శుభకార్యం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.