Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 12న ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 52 ఏళ్ల సుదీర్ఘ మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఒక్క క్రీడాకారిణి కూడా సాధించలేని ఓ అరుదైన ప్రపంచ రికార్డును స్మృతి మంధాన నెలకొల్పింది. సుమారు 1400 మంది క్రీడాకారిణులు పాల్గొన్న ఈ క్రీడా చరిత్రలో స్మృతి మంధాన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆ ఘనత సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణి
మహిళా క్రికెట్ లో అత్యంత అసాధారణమైనదిగా పరిగణించబడే ఒకే క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి క్రీడాకారిణిగా స్మృతి మంధాన నిలిచింది. మహిళా వన్డే ప్రపంచ కప్ 2025లో కొన్ని మ్యాచ్లలో (వరుసగా మూడు) నిరాశపరిచినప్పటికీ, ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆమె తన పరుగుల వేటను కొనసాగించింది. స్మృతిమంధాన 54 బంతుల్లో 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఈ మైలురాయిని చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం, మంధాన ఈ సంవత్సరంలో కేవలం 18 మ్యాచ్లలోనే 1031 పరుగులు సాధించడం విశేషం. పరుగుల స్థిరత్వం, వేగానికి ఇది నిదర్శనం. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన 66 బంతుల్లో 80 పరుగులు చేసి ఔట్ అయింది.

ఎవరి రికార్డును బద్దలు కొట్టింది?
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన బి.జె. క్లార్క్ పేరిట ఉండేది. ఆమె 1997లో 16 మ్యాచ్లలో 970 పరుగులు సాధించింది. స్మృతి మంధాన సుమారు మూడు దశాబ్దాల నాటి ఈ రికార్డును కేవలం 18 మ్యాచ్లలోనే బద్దలు కొట్టింది. ఈ విధంగా, తన ఫామ్ మరియు పరుగుల దాహంతో స్మృతి మంధాన, 52 ఏళ్ల చరిత్రలో ఎవరూ సాధించని ఒక కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది. ఇది భారత మహిళా క్రికెట్కు మాత్రమే కాకుండా, ప్రపంచ క్రికెట్కు కూడా ఒక గొప్ప మైలురాయి.