
రెండో మ్యాచులోనూ చిత్తు..
మంధానతోపాటు ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, హెదర్ నైట్ వంటి బిగ్ హిట్టర్లు ఉన్నా కూడా భారీ స్కోర్లు చేయడంలో ఈ టీం విఫలం అవుతోంది. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్లో ముంబై చేతిలో కూడా అలాగే ఘోరమైన ఓటమిని చవిచూసింది. దీనిపై మాట్లాడిన స్మృతి.. 'ఈ వికెట్పై మరింత మంచి స్కోరు చేసి ఉండాల్సింది. మేం అంత గొప్పగా రాణించలేదు. ఆ నిజాన్ని అంగీకరించక తప్పదు. తర్వాతి మ్యాచుల్లో కచ్చితంగా రాణిస్తాం. ఈ మ్యాచ్లో ఇద్దరు ముగ్గురు బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించాయి. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోవడంలో వాళ్లు విఫలమయ్యారు' అని తెలిపింది.
బ్యాటింగ్ వైఫల్యం వల్లనే..
జట్టులో ఉన్న బ్యాటింగ్ సమస్యను సీరియస్గా తీసుకుంటామని, మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తామని మంధాన చెప్పింది. 'మా దగ్గర మంచి ఆప్షన్స్తో మెరుగైన బౌలింగ్ యూనిట్ కూడా ఉంది. కానీ మేం అంత గొప్పగా ఆడలేదు. కాబట్టి ఇక బౌలర్లు ఏం చెయ్యలేకపోయారు. బ్యాటర్లుగా మేం మెరుగైన స్కోరు చెయ్యాల్సింది' అని మంధాన వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు జరగ్గా.. రెండింటిలో 200పైగా స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఆర్సీబీ మాత్రం 150 పరుగుల మార్కు అందుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. మంధాన, ఎలీస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, హెదర్ నైట్ ఎవరూ కూడా అంత గొప్ప ఫామ్లో ఉన్నట్లు కనిపించడం లేదు.
అంత టైం లేదు..
మ్యాచుల మధ్య ఎక్కువ గ్యాప్ లేకపోవడంతో తాము ఈ ఓటమి మూడ్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాల్సిన అవసరం ఉందని మంధాన అభిప్రాయపడింది. 'ఇది చాలా చిన్న టోర్నమెంట్. కాబట్టి ఈ ఓటములపై ఆలోచించే టైం ఉండదు. జట్టు లీడర్గా పాజిటివ్గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఒక విజయం సాధిస్తే.. ఆ తర్వాత వరుసగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓటమిని మర్చిపోయే ప్రయత్నం చేస్తాం. జట్టులో శ్రేయంక, కణిక ఇద్దరూ మంచి పాజిటివ్ ప్రభావం చూపించారు. జట్టుకు డీసెంట్ స్కోరు అందించడానికి వాళ్లు పడిన కష్టం, పరిస్థితిని చేతుల్లోకి తీసుకొని బాధ్యతగా ఆడటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం' అని మంధాన పేర్కొంది.


Click it and Unblock the Notifications












