ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మరో ఓటమిని మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ తో ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఇది వరుసగా మూడో ఓటమి. ఇప్పటివరకు అయిదు మ్యాచ్ లను ఆడిన మహిళల జట్టు.. రెండింట్లో మాత్రమే నెగ్గింది. తొలి మ్యచ్ లో శ్రీలంక, ఆ తర్వాత పాకిస్తాన్ ను ఓడించిన అనంతరం హ్యాట్రిక్ అపజయాలను అందుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్.. అద్భుతంగా రాణించింది. 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 288 పరుగులు సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ హీదర్ నైట్.. సెంచరీతో కదం తొక్కారు. 91 బంతుల్లో 15 బౌండరీలు, ఒక సిక్సర్ తో 109 పరుగులు చేశారు. ఓపెనర్ అమీ జోన్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. కేప్టెన్ నాట్ స్కీవర్- బ్రంట్ 38, ఓపెనర్ టామీ బ్రూమాంట్- 22, సోఫియా డంక్లీ- 15, ఎమ్మా లాంబ్- 11, అలైస్ క్యాప్సీ- 2, ఛార్లీ డీన్- 19, సోఫీ ఎక్కెల్ స్టోన్- 3 పరుగులు చేశారు.

289 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్.. చివరి వరకూ పోరాడింది గానీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 284 పరుగుల వద్దే ఆగిపోయింది జట్టు ప్రస్థానం. ఓపెనర్ స్మృతి మంధాన, కేప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మిడిలార్డర్ లో దీప్తీ శర్మ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటినప్పటికీ.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. స్మృతి మంధాన- 88, హర్మన్ ప్రీత్- 70, దీప్తీ శర్మ- 50 పరుగులు చేశారు.
గెలవడానికి చివరి ఓవర్ లో 14 పరుగులు చేయాల్సి ఉండగా.. 10 పరుగులతోనే సరిపెట్టుకుంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించలేకపోయారు. అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా.. తొలి మూడు బంతులకు సింగిల్స్ తీయడంతోనే ఓటమి ఖరారైంది. నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. అయిదో బంతిని డబుల్, చివరి బంతిని బౌండరీకి తరలించడంతో ఓటమి అంతరం తగ్గిందంతే.
ఈ మ్యాచ్ ను ఉత్కంఠతగా చూసిన స్మృతి మంధాన ఓటమి తప్పదని తెలిశాక.. భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వచ్చిన కన్నీటిని ఆపుకొంటూ తలదించుకోవడం కనిపించింది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని చెప్పారు. అనవసరపు షాట్ కు అవుట్ అయ్యానని, కొన్ని షాట్లు మిస్ ప్లేస్ అయ్యాయని అన్నారు. షాట్ సెలెక్షన్ సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లిన్సీ స్మిత్ బౌలింగ్లో లాఫ్టెడ్ షాట్ ఆడబోయి ఔటయ్యారు స్మృతి.
ఈ ఓటమితో భారత్.. . పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. చేతిలో రెండు మ్యాచ్ లే మిగిలివున్నాయి. ఈ నెల 23వ తేదీన ముంబైలో న్యూజిలాండ్ తో, ఆ తర్వాత బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది.