హైదరాబాద్: బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై విధించిన నిషేధాన్ని తగ్గించనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ ఏడాది సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్లో స్మిత్, వార్నర్లు బాల్ టాంపరింగ్కు పాల్పడినందుకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తాజాగా స్మిత్, వార్నర్ హోం అసోసియేషన్ న్యూ సౌత్ వేల్స్(ఎన్ఎస్డబ్ల్యూ) క్రికెట్ ఆస్ట్రేలియాకు సమర్పించిన వార్షిక నివేదికలో వీరిద్దరిపై విధించిన నిషేధం హెవీగా ఉందని, క్రికెట్ అభిమానులను సైతం నిరాశకు గురి చేస్తోందని పేర్కొంది.
దీనిపై న్యూ సౌత్ వేల్స్(ఎన్ఎస్డబ్ల్యూ) ఛైర్మన్ జాన్ నాక్స్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియాకు ఉన్న మిలియన్ల క్రికెట్ అభిమానులు తన జట్టు మంచి, పోటీతత్వ క్రికెట్ ఆడుతోందని భావిస్తున్నారు. మనందరి తరుపున ఆటగాళ్లు ప్రపంచ వేదికపై ప్రాతినిథ్యం వహిస్తున్నారు" అని అన్నారు.
"క్రికెట్ ఆస్ట్రేలియా కఠినమైన పెనాల్టీని వేసిన నేపథ్యంలో వారి తప్పులకు నిజమైన పశ్చాత్తాపం చూపించారు. ఇలాంటి కఠిన సమయాల్లో న్యూ సౌత్ వేల్స్ క్రికెట్ ఫ్యామిలీ స్మిత్, వార్నర్లకు మద్దతుగా నిలవాలని భావిస్తోంది. వారిద్దరూ తిరిగి జట్టులోకి రావాలని కోరుకుంటోంది. మనందరం మనుషులమే" అని తెలిపారు.
"దక్షిణాఫ్రికాలో జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతంపై యావత్ ప్రపంచంతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా సైతం షాక్కు గురైంది. బాల్ టాంపరింగ్కు పాల్పడిన ఆటగాళ్లు ఇద్దరూ న్యూ సౌత్ వేల్స్కు చెందిన ఆటగాళ్లు కావడం మమ్మల్ని ఎంతగానో నిరాశకు గురి చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది" అని జాన్ నాక్స్ అన్నారు.
ఈ నేపథ్యంలో వీరిద్దరిపై విధించిన ఏడాది నిషేధాన్ని ఎత్తివేసి, షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడించే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ని కోరామని తెలిపారు. స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం అనేది చాలా హెవీగా ఉందని, క్రికెట్ అభిమానులు సైతం ఈ నిషేధంపై నిరాశకు గురయ్యారని తెలిపారు.
బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు తాము చాలా పెద్ద తప్పు చేశామని, పశ్చాత్తాప పడిన వైనాన్ని సైతం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని జాన్ నాక్స్ సీఏను కోరారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రికెట్ సెప్టెంబర్లో ఆరంభం కానుంది.