
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా టీమ్పై ఆసీస్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం పరువు తీశారంటూ విరుచుకుపడింది. స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు సంస్కృతి పూర్తిగా దెబ్బ తిన్నదని 'స్మిత్ షేమ్' అంటూ ద ఆస్ట్రేలియన్, డైలీ టెలిగ్రాఫ్, ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తదితర పత్రికలు స్మిత్ ఫొటోతో కథనాలు ప్రచురించాయి.
ఇలాంటి చెత్త సంస్కృతిని చూస్తూ ఏమీ చేయలేకపోతున్న బోర్డు చీఫ్ సదర్లాండ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆసీస్ మీడియా డిమాండ్ చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా జాతీయ క్రీడ. అలాంటి జాతీయ క్రీడలో ఆస్ట్రేలియన్లు బాల్ టాంపరింగ్కు పాల్పడటాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనను ఓ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించాయి.
ఈ మోసం ఆస్ట్రేలియా క్రికెట్ను హెల్మెట్ నుంచి బూటు వరకు తీవ్రంగా దెబ్బతీసిందని ది ఆస్ట్రేలియన్ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. రెండు దశాబ్దాలుగా క్రికెట్ బోర్డు బాధ్యతలు చూస్తున్న సదర్లాండ్ జట్టులో ఈ కుళ్లిపోయిన సంస్కృతిని ఎందుకు మార్చడం లేదంటూ ప్రశ్నించింది. ఈ ఘటన దేశానికి ఘోర అవమానం అని స్పష్టంచేసింది.
ఇక, సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్ పత్రిక స్పోర్ట్స్ రైటర్ రాబర్ట్ క్రాడక్ స్పందిస్తూ ఎలాగైనా గెలవాలన్న సంస్కృతి.. ఇలా సిగ్గులేని, నీతిమాలిన చర్యలకు పురిగొల్పుతున్నదని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటన తర్వాత స్మిత్ అండ్ టీమ్ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిన్నదని, అది ఎప్పటికీ తిరిగి రాదని ఆయన స్పష్టం చేశారు.
ఈ తప్పుకు ఆస్ట్రేలియా క్రికెట్ భారీ మూల్యమే చెల్లించాలని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక పేర్కొంది. ఈ ఘటనతో ఆస్ట్రేలియా క్రికెట్ పరువు డ్రైనేజ్లో కలిసిపోయిందని ఆ పత్రిక విమర్శించింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకు చెందిన టాప్ క్రికెటర్లు బాల్ టాంపిరింగ్ వివాదంలో చిక్కుకోవడంతో వారికి స్పాన్సర్లగా ఉన్న వారు ఆందోళనలో పడ్డారు.
వీరిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కఠిన చర్యలు తీసుకుంటే స్పాన్సర్లు తమ ఒప్పందాలను రద్దు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపించేందుకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా ఛీప్ జేమ్స్ సదర్లాండ్ దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
శుక్రవారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కి ముందే విచారణ పూర్తి చేస్తామని తెలిపారు. అయితే, ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్ ఇంకా దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. సీఏ అధికారులు దీనిపై విచారించేందుకు దక్షిణాఫ్రికా వచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు స్మిత్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిపారు.