
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో భాగంగా తొలిసారి గులాబీ బంతితో జరుగుతున్న డే/నైట్ టెస్టు సమరం ఆసక్తిగా జరుగుతోంది. శనివారం ఆరంభమైన రెండో మ్యాచ్ తొలి రోజు ఇరు జట్లు సమాన ప్రదర్శన చేశాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 81 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. 1982లో అప్పటి ఇంగ్లీష్ కెప్టెన్ బాబ్ విల్లిస్ తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్న కెప్టెన్గా జోరూట్ నిలిచాడు. వర్షం కారణంగా తొలి సెషన్లో 13.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఆదిలోనే వికెట్లు తీసి ఆస్ట్రేలియాను జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ రూట్కు నిరాశే మిగిలింది. ఆసీస్ ఓపెనర్లు బాన్క్రాఫ్ట్(10), వార్నర్(47) మెరుగైన శుభారంభం అందించారు. రెండో సెషన్ తొలి ఓవర్లోనే ఓపెనర్ బెన్క్రాఫ్ట్ (10) రనౌట్ రూపంలో వెనుదిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఖవాజా.. వార్నర్కు జతకలిశాడు.
వీరిద్దరూ నిలకడగా ఆడుతూ ఆసీస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, ఇన్నింగ్స్ 34వ ఓవర్లో వోక్స్ ఈ జోడీని విడదీశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో కీపర్ బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి వార్నర్ రెండో వికెట్గా ఔటయ్యాడు. ఆ తర్వాత అండర్సన్ బౌలింగ్లో ఖవాజా పెవిలియన్ చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (40)కు మంచి ఆరంభం లభించినా దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. అడిలైడ్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ బౌలర్ ఓవెర్టన్కు బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి హ్యాండ్స్కోంబ్ (36), షాన్ మార్ష్ (20) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, క్రిస్ వోక్స్, ఓవర్టన్ తలో వికెట్ తీశారు.