గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబె విధ్వంసం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగిన దూబె సిక్సర్లతో హోరెత్తించాడు. మంగళవారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 36 బంతుల్లో అజేయంగా 71 పరుగులు సాధించాడు. ఏకంగా ఏడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. ఈ ఆల్రౌండర్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
శివమ్ దూబెతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అర్ధశతకంతో చెలరేగాడు. 46 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, నాలుగు బౌండరీలు బాదాడు. వీరిద్దరు విరుచుకుపడటంతో పాటు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సర్వీసెస్పై ముంబై 39 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 192 పరుగులు చేసింది.

అయితే ముంబై శుభారంభం దక్కలేదు. 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా మూడు బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. అజింక్య రహానె (22; 18 బంతుల్లో, 3 ఫోర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20; 14 బంతుల్లో, 4 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ స్థితిలో బాదే బాధ్యతలు అందుకున్న సూర్య-దూబె ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. 66 బంతుల్లో నాలుగో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అనంతరం ఛేదనకు దిగిన సర్వీసెస్ 19.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మోహిత్ (54; 40 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. నలుగురు బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. కాగా, గత మ్యాచ్లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. షామ్స్ ములాని మూడు వికెట్లు తీశాడు. ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
7 SIXES BY SHIVAM DUBE IN HIS RETURN TO CRICKET AFTER INJURY 🥶 pic.twitter.com/RLK45KdnnN
— Johns. (@CricCrazyJohns) December 3, 2024