
ముంబై: జూలైలో శ్రీలంకలో జరగనున్న భారత జట్టు పర్యటన సందిగ్ధంలో పడింది. లంకలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ పర్యటన జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. గురువారం లంకలో కొత్తగా 3269 కేసులు, 24 మరణాలు సంభవించాయి. గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య మొత్తం 16343లు కాగా మరణాలు 147గా ఉంది. మెల్లగా కరోనా రెండో వేవ్ ప్రభావం అక్కడ కూడా పెరుగుతోంది. వైరస్ కారణంగా గతేడాది జరగాల్సిన శ్రీలంక-భారత్ పర్యటనను ఇప్పటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
'పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ గతేడాది కరోనా ఉన్నప్పటికీ ఇంగ్లండ్, ఇతర సిరీసులను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు భారత్తో సిరీసునూ అలాగే నిర్వహిస్తామన్న నమ్మకం ఉంది. ఏదేమైనా కేసులు పెరగకూడదని కోరుకుంటున్నాం' అని శ్రీలంక క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే ఈ పర్యటనపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. శ్రీలంకతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులకు ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి వెళ్లనున్న కోహ్లీసేన.. అక్కడ న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. నెల రోజుల తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఢీకొట్టబోతోంది. ఇందుకోసం 20 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు బంతి స్పెషలిస్టులు శ్రీలంకలో పర్యటిస్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. భారత బీ టీం లంకలో పర్యటించనుంది. ధావన్, భువనేశ్వర్, హార్దిక్, చహల్, శాంసన్, షా, దీపక్, రాహుల్, చక్రవర్తి, తెవాతియాలు లంకకు వెళ్లనున్నారు.
సమాచారం ప్రకారం భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. 2018లో ఆఖరిగా శ్రీలంకలో భారత్ మ్యాచ్లు ఆడింది. శ్రీలంకకి వెళ్లిన తర్వాత టీమిండియా కనీసం వారం రోజులు క్వారంటైన్లో ఉండనుంది. ఈ వారంలో మూడు రోజులు ఆటగాళ్లు గదులకే పరిమితంకానుండగా.. మిగిలిన నాలుగు రోజులు హోటల్ పరిధిలోనే ప్రాక్టీస్, జిమ్ని వినియోగించుకునే వెసులబాటుని కల్పించనున్నారు.