గాలె వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. 63 పరుగుల తేడాతో నెగ్గి రెండు టెస్టుల సిరీస్ను ఘనంగా బోణీ కొట్టింది. ఆఖరి రోజు ఆట ఆరంభమైన 3.4 ఓవర్లకే లంక విజయ ఢంకా మోగించింది. 275 పరుగుల లక్ష్యంతో ఛేదన దిగిన న్యూజిలాండ్ 211 పరుగులకు కుప్పకూలింది.
ఓవర్నైట్ స్కోరు 207/8తో ఇవాళ ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగు పరుగులే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఇవాళ ఆటపై క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిచూపించింది. విజయ సమీకరణం లంకు రెండు వికెట్లు, కివీస్కు 68 పరుగులుగా ఉండటంతో చివరి రోజు హోరాహోరీగా సాగుతుందని భావించారంతా. కానీ న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర (92; 168 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) ఆదిలోనే ఔటవ్వడంతో శ్రీలంక విజయం లాంఛనమైంది.

రచిన్ రవీంద్రను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిన ప్రభత్ జయసూర్య వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే విలియన్ రొర్కేను కూడా డకౌట్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, ఇటీవల శ్రీలంక క్రికెట్ జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తోంది. భారత్పై వన్డే సిరీస్ గెలిచింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. తాజాగా సొంతగడ్డపై న్యూజిలాండ్ను చిత్తు చేసింది.
తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 305 పరుగులు చేసింది. కామిందు మెండిస్ (114) శతకం సాధించాడు. కుశాల్ మెండిస్ (50) హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. విలియమ్ రొర్కే (5/55) అయిదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 340 పరుగులు చేసింది. లాథమ్ (70), డారిల్ మిచెల్ (57), గ్లెన్ ఫిలిప్స్ (49) రాణించారు. ప్రభత్ జయసూర్య (4/136) నాలుగు వికెట్లు తీశాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నె (83) టాప్ స్కోరర్. చండిమల్ (61), మాథ్యూస్ (50) అర్ధశతకాలు సాధించారు. అజాజ్ పటేల్ (6/90) వికెట్లతో విజృంభించాడు. ఇక ఛేదనలో కివీస్ 211 పరుగులకు ఆలౌటైంది. ప్రభత్ జయసూర్య (5/68) అయిదు, రమేశ్ మెండిస్ (3/83) మూడు వికెట్లు తీశారు.