
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఆరంభమైంది. తొలి మ్యాచ్కు మెల్బోర్న్ గీలాంగ్లోని సైమండ్స్ స్టేడియం వేదికగా మారింది. శ్రీలంకతో నమీబియా తలపడుతోంది. శ్రీలంక టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రారంభ ఓవర్లల్లో కట్టుదిట్టంగా బంతులను సంధించిన బౌలర్లు.. ఆ తరువాత చేతులెత్తేశారు.
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్ ఆశించిన స్థాయిలో ఆరంభం కాలేదు. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. వెంటవెంటనే ఓపెనర్లు అవుట్ అయ్యారు. మైఖెల్ వాన్ లింగెన్-3, దివాన్ లా కాక్-9 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఈ రెండు వికెట్లను కూడా దుష్మంత చమీర, ప్రమోద్ మధుశంక లియగమగె తీసుకున్నారు.
టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఓ మోస్తరు పోరాట పటిమను కనపరిచారు. జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ 20, స్టెఫాన్ బార్డ్-26, కేప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్-20 పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ వీస్ది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలిబంతికే అవుట్ అయ్యాడు. 14.2 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసిన దశలో నమీబియా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు గేర్ మార్చారు. కౌంటర్ అటాక్కు దిగారు. లంక బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొన్నారు.
జాన్ ఫ్రైలింక్, జొహాన్నెస్ జొనాథన్ స్మిత్.. ధాటిగా ఆడారు. లంక బౌలింగ్ను ఉతికి ఆరేశారు. చివరి అయిదు ఓవర్లల్లో 63 పరుగులను పిండుకున్నారంటే ఈ ఇద్దరు ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు. జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. అదే స్థాయిలో రెచ్చిపోయాడు జొనాథన్ స్మిత్ కూడా. 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
వీరిద్దరి కౌంటర్ అటాక్కు నమీబియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 163 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లల్లో ప్రమోద్ మధుశంక రెండు వికెట్లు తీసుకున్నాడు. మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నె, వనిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.