
కొలంబో: వన్డే, టీ20 సిరీస్ల కోసం సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంకకు వెళ్లిన భారత యువ జట్టు ప్రాక్టీస్ మొదలెట్టింది. గురువారం క్వారంటైన్ ముగియడంతో.. శుక్రవారం ధావన్ సేన మైదానంలో అడుగుపెట్టింది. మొదటగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన ప్లేయర్స్.. ఆ తర్వాత జంపింగ్ చేశారు. యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, కృనాల్ పాండ్యాలు పరుగు పందెంలో పోటీపడ్డారు. భారత ఆటగాళ్లు చివరకు బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశారు. ప్రాక్టీస్ మధ్యలో కెప్టెన్ శిఖర్ ధావన్, కోచ్ రాహుల్ ద్రవిడ్లు జట్టు సాధనపై చర్చించారు. ఇందుకు సంబందించిన ఫోటోలని బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
భారత జట్టు క్వారంటైన్ గురువారం ముగియడంతో.. ప్లేయర్ తిరిగి ఒకర్నొకరు కలుసుకొనేందుకు అవకాశం లభించింది. తమకు లభించిన ఈ అవకాశాన్ని గురువారం సాయంత్రం యువ క్రికెటర్లు అందరూ అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఇదే అదునుగా వినూత్నమైన ఆటలు ఆడారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లంతా ఈత కొలనులో సందడి చేశారు. కొలనులో బంతితో ఆడారు. అంతేకాకుండా కేరింతలు కొడుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సిరీస్ ఆరంభం అయ్యేలోపు జట్టులోని ఆటగాళ్ల మధ్య బంధం పెంచేందుకు బీసీసీఐ ఇలా చేసింది.
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో.. ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అన్ని మ్యాచులు జరుగుతాయి. వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలు, టీ20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి.
భారత జట్టు:
శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరున్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.