
షార్జా: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరుతున్న మ్యాచులో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసి.. లంక ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బంగ్లా ఓపెనర్ మహ్మద్ నయీమ్ (62; 52 బంతుల్లో 6x4), సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (57; 37 బంతుల్లో 5x4, 2x6)లు హాఫ్ సెంచరీలు చేశారు. స్టార్ ప్లేయర్స్ లిటన్ దాస్ (16), షకీబ్ అల్ హసన్ (10), మహ్మదుల్లా (10)లు పూర్తిగా విఫలమయ్యారు. లంక బౌలర్లు చమిక కరుణరత్నే, బినురా ఫెర్నాండో, లహిరు కుమార తలో వికెట్ పడగొట్టారు. దుష్మంత చమీర నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో లిటన్ దాస్ (16: 16 బంతుల్లో 2x4)తో కలిసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ని మొహ్మద్ నయీమ్ ఘనంగా ఆరంభించారు. ఈ ఇద్దరు లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ఈ క్రమంలో తొలి వికెట్కి 5.5 ఓవర్లలో 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే దూకుడు పెంచే క్రమంలో దాస్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన షకీబ్ అల్ హసన్ (10: 7 బంతుల్లో 2x4) నిరాశపరిచాడు. దాస్, షకీబ్ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో బంగ్లా స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఆపై అఫీఫ్ హుస్సేన్ (7) కూడా ఔట్ అయ్యాడు.
ఈ సమయంలో మహ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీమ్ జట్టును ఆదుకున్నారు. మిడిల్ ఓవర్లలో నిలకడగా ఆడిన రహీమ్.. స్లాగ్ ఓవర్లలో వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ముందుగా నయీమ్ హాఫ్ సెంచరీ చేయగా.. ఆపై రహీమ్ ఫిఫ్టీ బాదాడు. దాంతో బంగ్లా భారీ స్కోర్ దిశగా సాగింది. ఇక ఇన్నింగ్స్ చివరలో కెప్టెన్ మహ్మదుల్లా (10 నాటౌట్: 5 బంతుల్లో 2x4) కూడా విలువైన పరుగులు చేశాడు. దాంతో లంక ముందు బంగ్లా పోరాడే స్కోర్ చేసింది. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నె, ఫెర్నాండో, లాహిరు కుమార ఒక్కో వికెట్ మాత్రమే తీయగలిగారు. చమీర నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు.