SL vs BAN: గాలెలో జరుగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27ను అద్భుతంగా ప్రారంభించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు.. బౌలర్ తరిందు రత్నాయకే 45 పరుగులకే 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను కష్టాల్లోకి నెట్టడంతో మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత నాలుగో వికెట్కు బంగ్లాదేశ్ బ్యాటర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో(136 పరుగులు), ముష్ఫికర్ రహీమ్(105 పరుగులు) అజేయంగా 24 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి తమ జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. వీరిద్దరూ కలిసి శ్రీలంక స్పిన్ అటాక్ను పూర్తిగా నిస్సహాయంగా మార్చేశారు.
తృటిలో తప్పించుకున్న శాంటో
సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో నజ్ముల్ హుస్సేన్ శాంటో సెంచరీ పూర్తి చేసుకున్న ఆనందంలో గాలిలోకి ఎగిరి సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక బంతి వేగంగా అతని వైపు దూసుకొచ్చింది. శాంటో తృటిలో ఆ బంతి నుంచి తప్పించుకుని నవ్వుతూ తన సంబరాలను పూర్తి చేసుకున్నాడు. ఆ క్షణం సరదాగా ఉండటమే కాకుండా.. బంతి విసిరిన వారిని ఏం అనలేదు. ఇది మైదానంలో శాంటో ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని చాటుతుంది.

బలహీనంగా శ్రీలంక బౌలింగ్
శ్రీలంకకు ఈ టెస్ట్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఏంజెలో మాథ్యూస్ చివరి టెస్ట్. ఈ టెస్ట్ తర్వాత ఈ దిగ్గజ శ్రీలంక ఆల్రౌండర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడు. తమ అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్కు అతని చివరి టెస్టులో విజయం అందించడంలో శ్రీలంక బౌలర్లు ఇప్పటివరకు విఫలమయ్యారు. స్పిన్ ద్వయం ప్రభాత్ జయసూర్య, తరిందు రత్నాయకే 61 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఐదుగురు బౌలర్లు ఉన్నప్పటికీ శ్రీలంక జట్టు శాంటో, ముష్ఫికర్ అడ్డుగోడను ఛేదించలేకపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక భారీ స్కోరుపై దృష్టి సారించింది.