కొలంబో: శ్రీలంకలో పర్యటిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఏదీ కలిసి రావట్లేదు. శ్రీలంకపై 2-1 తేడాతో టీ20 సిరీస్ను గెలిచిందన్న మాటే గానీ- చేదు అనుభవాలే చవి చూస్తోంది. అయిదు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ను 1-3 తేడాతో కోల్పోయింది. శ్రీలంక చేతిలో వరుసగా మూడింట్లో ఓడిపోయింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ను సొంతం చేసుకోగలిగింది శ్రీలంక. ఈ రెండు జట్ల మధ్య అయిదవ, చివరి మ్యాచ్ శుక్రవారం జరుగనుంది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీని తరువాత రెండు టెస్టుల సిరీస్ ఆరంభమౌతుంది. ఈ నెల 29వ తేదీన ఉదయం 10 గంటలకు గాలే స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తొలి టెస్ట్లో తలపడనున్నాయి. జులై 8వ తేదీన అదే స్టేడియంలో రెండో టెస్ట్ షెడ్యూల్ అయింది. చివరి వన్డే మ్యాచ్లో గెలిచి, పరువు నిలుకోవాలనుకుంటోన్న ఆస్ట్రేలియా జట్టుకు మరోసారి చుక్కెదురైంది.
ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. గాయపడ్డాడు. గాయం వల్ల చివరి వన్డే నుంచి వైదొలిగాడు. నాలుగో వన్డేలో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ట్రవిస్ హెడ్కు తొడ కండరాలు పట్టేశాయి. చివరి వన్డేకు అతను అందుబాటులో ఉండట్లేదని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. కేప్టెన్ ఆరోన్ ఫించ్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. లో గ్రేడ్ హ్యామ్స్ట్రింగ్ గాయమే అయినప్పటికీ.. ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు. అయిదో వన్డేకు ట్రవిస్ హెడ్ అందుబాటులో ఉండకపోవచ్చని చెప్పాడు.
ఈ సిరీస్లో గాయపడ్డ మూడో ఆస్ట్రేలియన్ క్రికెటర్.. ట్రవిస్ హెడ్. ఇదివరకు స్టీవెన్ స్మిత్ వైదొలగిన విషయం తెలిసిందే. క్వాడ్ నిగ్గెల్స్తో అతను బాధపడుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ పరిస్థితి కూడా ఇంతే. వేలిగాయం వల్ల అతను జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. 29వ తేదీన ఆరంభం కానున్న టెస్ట్ మ్యాచ్కు స్టీవెన్ స్మిత్, మిఛెల్ స్టార్క్ జట్టులోకి వస్తారని ఆసీస్ మేనేజ్మెంట్ చెబుతోంది. ట్రవిస్ హెడ్ గాయం తీవ్రత ఆధారంగా అతణ్ని టెస్టుల్లోకి తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ధారిస్తామని పేర్కొంది.