

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మూడు వన్డేల సిరీస్లో రెండో వన్డేలో టీమిండియా 86 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి వన్డే విజయోత్సాహంతో బరిలోకి దిగిన విరాట్ గ్యాంగ్.. రెండో వన్డేలో మాత్రం విఫలమైంది. ఈ ఓటమి తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. 59 బంతులాడిన ధోని పేలవంగా రెండు ఫోర్లు మాత్రమే కొట్టి 37 పరుగుల వద్ద ఔటయ్యాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి పరుగుల కోసం తీవ్రంగా శ్రమించిన ధోనీ.. ఎక్కువగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. దీంతో.. క్రమంగా బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మ్యాచ్లో ధోని కంటే చాహల్ (12; 12 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్తో మెరుగ్గా ఆడాడని ఫ్యాన్స్ చురకలు అంటిస్తున్నారు. అయితే ధోని బ్యాటింగ్ తీరును కెప్టెన్ విరాట్ కోహ్లి వెనుకేసుకొచ్చాడు.
'ప్రతీసారి ధోని సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించడం కుదరదు. ఓవరాల్గా చూస్తే ధోని అతని శైలిలో ఆడటానికి పరిస్థితులు అనుకూలించలేదు. రెండో వన్డేలో ధోని బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. ధోని బాగా ఆడితే.. బెస్ట్ ఫినిషర్ అంటూ కితాబిస్తారు. ఆడకపోతే అతనిపై పడతారు. ఒకసారి విమర్శలు చేసే ముందు కాస్త ఆలోచించండి. ధోని ఒక అనుభవం ఉన్న ఆటగాడు. మేము 150-160 పరుగుల తేడాతో ఓడిపోవాలని కోరుకోలేదు. కడవరకూ బ్యాటింగ్ కొనసాగించాలనేది మా గేమ్ ప్లాన్.'
'అందులో భాగంగా ధోని సమయోచితంగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. శనివారం మాకు దుర్దినంగా చెప్పొచ్చు. లక్ష్య ఛేదనకు దిగినప్పుడు ఆరంభం బాగానే ఉంది. కానీ మూడొందలకు పైగా లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో వికెట్లు చేతిలో ఉండాల్సింది. దూకుడుగా ఆడితే నష్టపోవాల్సి వచ్చింది. సెకాండాఫ్లో పిచ్ బాగా నెమ్మదించింది. అదే సమయంలో కొన్ని కీలక వికెట్లను తొందరగా కోల్పోయాం. ఇదే ఓటమిపై ప్రభావం చూపింది. అంతేకానీ ఓటమికి ధోని పూర్తిస్థాయి బాధ్యుడ్ని చేయడం భావ్యం కాదు. అతనొక గొప్ప ఆటగాడనే విషయం మరిచిపోకండి' అని కోహ్లి తెలిపాడు.