Jasprit Bumrah: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో "హానర్స్ బోర్డు"పై పేరు సంపాదించినా.. ఐదో వికెట్ తీసిన తర్వాత కూడా పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బుమ్రా బౌలింగ్ ప్రదర్శన ఎంతగా ప్రశంసలు అందుకుందో.. అతని నిశ్శబ్ధ ప్రతిస్పందన కూడా అభిమానుల్లో అంతగా చర్చనీయాంశమైంది. జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టులోని తొలి ఇన్నింగ్స్లో 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యేందుకు సహాయపడింది.
ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ మరోసారి తాను భారత్ తరఫున ఆడిన అత్యుత్తమ బౌలర్లలో ఒకడని నిరూపించాడు. ఇంగ్లండ్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్ను అధిగమించాడు. భారత్ తరఫున ఇంగ్లండ్లో ఆడిన 13 టెస్ట్ మ్యాచ్లలో కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు మూడు వికెట్లు తీసి 47 వికెట్లతో కపిల్ దేవ్ ను అధిగమించాడు. అంతే కాకుండా బుమ్రా కెరీర్లో లార్డ్స్లోని ప్రసిద్ధ 'ఆనర్స్ బోర్డు'లో పేరు నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత బుమ్రా ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. అసలు అలా ఎందుకు ఉన్నాడని విషయంపై ప్రెస్ కాన్ఫరెన్స్ లో బుమ్రా స్పష్టతనిచ్చాడు. దీనికి కారణం అలసట అంటూ చెప్పుకొచ్చాడు.

" నిజం చెప్పాలంటే నేను బాగా అలసిపోయాను. అక్కడ సంబరాలు చేసుకోవడానికి ఏమీ లేదు. మైదానంలో చాలా సమయంపాటు బౌలింగ్ చేసి శారీరకంగా అలసిపోయా. ఎగిరి గంతులు వేసేందుకు నేనేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదు. సాధారణంగానే నేను అలా చేయడానికి ఇష్టపడను. నా ఐదు వికెట్ల ప్రదర్శనపై ఆనందంగా ఉన్నా. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేసేందుకు వెళ్లిపోయా. జట్టు తోడ్పడినందుకు సంతోషంగా ఉంది." అని బుమ్రా తెలిపాడు. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 18 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీయగా.. రెండో రోజు 9 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఇది బుమ్రాకు 15వ 5 వికెట్ల ప్రదర్శన. విదేశాల్లో ఇది 12వ సారి.
భారత్ 145/౩.. క్రీజులో పంత్, రాహుల్
అండర్సన్-టెండూల్కర్ సిరీస్ లో భాగంగా 1-1తో సమంగా ఉన్న భారత్, ఇంగ్లాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా సిరీస్ లో రెండో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. జో రూట్(104) శతకం పూర్తి చేయగా.. జేమీ స్పిత్(51), బ్రైడన్ కార్స్(56) హాఫ్ సెంచరీలతో జట్టు మంచి స్కోరును అందించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండోరోజు ఆట చివరికి 145/3తో నిలిచింది. కేఎల్ రాహుల్(53), రిషబ్ పంత్(19) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(13) త్వరగా ఔటైనప్పటికీ కేఎల్ రాహుల్ తన 53 పరుగుల ఇన్నింగ్స్ తో నాటౌట్గా నిలిచాడు. రిషబ్ పంత్ వేలికి గాయమైనప్పటికీ ఐదో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేసి భారత జట్టును ఆదుకున్నాడు.