
అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆరేళ్ల తర్వాత అగ్ర స్థానానికి తిరిగి చేరుకుంది. చివరగా 2016 ఫిబ్రవరిలో టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత్.. ఆ తర్వాత ఆ స్థానం నుంచి దిగజారింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత తాజాగా భారత జట్టు అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో సొంత గడ్డపై వెస్టిండీస్ను టీ20 సిరీస్లో టీమిండియా వైట్ వాష్ చేసింది. 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత జట్టుకు అగ్ర స్థానం లభించింది. గత 39 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్, ఇంగ్లండ్ జట్లు ఒకే రేటింగ్తో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ జట్టు కన్నా టీమిండియాకు 10 పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భారత జట్టుకు అగ్ర స్థానం లభించింది. ఇరు జట్లకు సమానంగా 269 రేటింగ్ ఉంది. కానీ పాయింట్ల పరంగా భారత్ ఖాతాలో 10,484 ఉండగా.. ఇంగ్లండ్ ఖాతాలో 10,474 ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్కు రెండో స్థానం దక్కింది.
భారత్, ఇంగ్లండ్ తర్వాత ఈ జాబితాలో 266 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఆ జట్టు ఖాతాలో 255 పాయింట్లు ఉన్నాయి. 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉంది. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్ 4-1తో గెలుచుకున్నప్పటికీ 2021 వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 249 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక భారత్ చేతిలో తాజాగా వైట్వాష్కు గురైన వెస్టిండీస్ 235 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. 232 పాయింట్లతో ఆఫ్ఘనిస్థాన్ ఎనిమిదో స్థానంలో ఉండగా.. 231 పాయింట్లతో శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఖాతాలో కూడా 231 పాయింట్లు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ పదో స్థానంలో ఉంది.
కాగా గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో కివీస్ చేతిలో ఓటమి అనంతరం టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రపంచకప్లో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన భారత్.. ఆ తర్వాత కివీస్తో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తాజాగా విండీస్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా క్లీన్స్వీప్ చేసింది. దీంతో టీమిండియా వరుసగా 9 టీ20 మ్యాచ్లను గెలిచింది.